దేశంలో యువ నాయకత్వం ఎక్కడ?

దేశంలో యువ నాయకత్వం ఎక్కడ?

ప్రజాస్వామ్య దేశమైన మన దేశంలో ఎన్నికల విధానాన్ని పాలకులు పూర్తిగా మార్చిపారేశారు.  యువకులు అన్ని రంగాల్లో ముందుండాలంటూ ప్రోత్సహిస్తున్నప్పటికీ రాజకీయ అవకాశాలు ఇవ్వడంలో అన్నీ పార్టీలు ఒకేలా వ్యవహరిస్తున్నాయనడంలో సందేహం లేదు. ధనస్వామ్య దేశంగా మార్చి ఎన్నికల ప్రక్రియలో యువత అనర్హులు అన్నట్లుగా చిత్రీకరిస్తున్నారు. విలువలు కలిగి ఉన్నతమైన చదువులు చదివి, సమాజం పట్ల అవగాహన కలిగిన యువతకు అవకాశాలు ఇవ్వకుండా అరవై ఏళ్లు దాటిన వారికే ప్రాధాన్యతను ఇస్తున్నారు. 

యువత లేకుండా ఏ ఉద్యమం లేదు..

మనదేశంలో జరిగిన అనేక సామాజిక, అసమానతల రాజకీయ పోరాటాల్లో యువత భాగస్వామ్యం లేని ఏ ఉద్యమం లేదు. అది దేశ విముక్తి అయినా తెలంగాణ రాష్ట్రం కోసమైనా అనేక మంది విద్యార్థుల, ఆత్మబలిదానాల, ప్రాణాలకు తెగించిన వారి పోరాటం వల్లనే జరిగింది. సమాజంలో గుణాత్మక విలువలు కాపాడేలా కృషి చేస్తున్నారు యువకులు. బార్డర్‌‌‌‌లో బాహ్య శత్రువులు దేశంలోకి చొరబడకుండా రక్షణగా నిలుస్తున్నారు. 30 ఏళ్ల లోపు దేశరక్షణలో అమరులైన యువత కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. దేశ రాజకీయాల్లో ముఖ్యంగా వారసత్వానికి పెద్దపీట వేయడం వేదికలా మారింది. దీంతో సమాజానికి మంచి చేయాలనే తపన కలిగిన సామాజిక స్పృహ కలిగిన యువతలో రాజకీయ నైపుణ్యం ఉన్నప్పటికీ దానిని ఎప్పటికప్పుడు నాయకులు ఎదగకుండా తొక్కి పడుతున్నారు. అయినా ఎంత అణచివేసినా అక్కడక్కడ యువచైతన్యం తమ సత్తాను చాటుతోంది.

యువనేతలుగా గెలుపొందిన వారు..

పరిశ్రమలలో, ఉద్యోగాల్లో, వివిద రంగాల్లో యువతను అడ్డుకునే వారు లేరు ఎందుకంటే అవి వారి ప్రతిభ ఆధారంగా పొందినవి. కానీ ఓ విద్యావంతుడు, యువకుడు నాయకునిగా ఎదిగితే మాత్రం పాలకవర్గం తట్టుకోలేకపోతోంది.  అయినప్పటికీ ఆయా రాష్ట్రాలలో యువకులు స్వతంత్ర ఆభ్యర్థులుగా నిలిచి గెలుస్తున్నారు. గుజరాత్ రాష్ట్రంలో  జిగ్నేష్ మేవాని, అలాగే ఇటీవల జరిగిన అసోం ఎన్నికలలో ఓ సామాజిక కార్యకర్తలు జైలు నుంచే పోటీ చేసి గెలుపొందారు. ఇటువంటి అనేక మంది యువత దేశం కోసం, ఆయా రాష్ట్రాల్లోనూ నిబద్ధతతో ఆధునికంగా ఆలోచించే నాయకత్వం చేయాలన్నా దానిని పాలకులు యువ నాయకత్వాన్ని అణచివేయడంలో విజయవంతమవుతున్నారు. ఫలితంగా రాజకీయ వారసులను తెరపైకి తెచ్చుకొని అందలాలు ఎక్కిస్తున్నారు. ఎక్కడో అమెరికా, లండన్‌‌లో చదివి.. ఇక్కడి సమాజం, ఇక్కడి ప్రజల కష్ట, నష్టాలు, సామాజిక అంతరాలు ప్రత్యక్షంగా చూడలేని వారు రేపు సమాజంలో కేవలం వారు అధికార హోదాను అనుభవించడం తప్ప. ఎటువంటి మార్పు తీసుకువస్తారు. అసోంలో యువకుల ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన ఆనాడు అస్సాం పరిషత్ తరుపున దేశంలోనే అతిచిన్న వయసులో సీఎం అయిన వ్యక్తి ప్రఫుల్లానాథ్‌‌. విద్యార్థి ఉద్యమ, సామాజిక అసమానతల పోరాటం నుంచి రాజకీయ పార్టీగా మార్చి రాష్ట్రానికి దేశంలో అందరూ ఆశ్చర్యపోయేలా రాజకీయ పోరాటం ద్వారా సీఎంగా బాధ్యతలు గతంలో చేపట్టారు.  ఈ దేశంలో మొదటి లోక్​సభ ఏర్పడిన టైమ్‌‌లో దాదాపు 27 శాతం యువకులు ఆనాడు పార్లమెంటులో సభ్యులుగా ఉంటే.. నేడు  ఏడు శాతం మాత్రమే యువకులు లోక్ సభ సభ్యులుగా ఉన్నారంటే ..దేశ రాజకీయాలలో యువత అణచివేత ఏ మేర ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 

యువతలో టాప్‌‌ టూ.. నాయకత్వంలో జీరో

 ప్రపంచ దేశాల్లోనే అత్యధికంగా యువత కలిగిన దేశంగా రెండో స్థానంలో ఉన్న ఇండియా యువ నాయకత్వం మాత్రం జీరోగా మారింది. అందుకు పాలకుల పరోక్ష కారణాలు, ధనస్వామ్య రాజకీయాలని స్పష్టంగా చెప్పవచ్చు.  అలాగే యువతలో రాజకీయ చైతన్యం లేకపోవడం రైడా మరో కారణంగా అర్థం చేసుకోవచ్చు.  దేశ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఓ కార్యక్రమానికి హాజరై విద్యార్థి నాయకత్వం వల్లే దేశానికి మేలు చేకూరుతుందని చెప్పడం ఆలోచించాల్సిన విషయం. 75 ఏళ్ల రిపబ్లిక్‌‌ ఇండియాం ఇంకా అసమానతలు, అభివృద్దికి దూరంగా బతుకుతున్న ఎందరికో దారి చూపడానికి... సామాజిక పోరాటం ఒక్కటే కాదు. చట్టాల ద్వారా వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత ఆధునిక పోటీ ప్రపంచానికి తగ్గట్టుగా భారత్ అన్ని రంగాల్లో రాణించాలంటే యువశక్తి నాయకత్వంలో ప్రధాన పాత్రను పోషించడం వల్లనే అది సాధ్యమవుతుంది. బార్డర్‌‌‌‌లో జవాన్లలా... ప్రజాస్వామ్య రక్షకులుగా.. వారసత్వ రాజకీయాలను తిప్పికొట్టడానికి యువత సంఘటితంగా చట్టసభల్లోకి వెళ్లేలా ధన, వారసత్వ రాజకీయాలపై తిరుగుబాటు చేసి.. నవసమాజాన్ని, కుట్రలు లేని గుణాత్మకమైన రాజకీయాల కోసం పోరుబాట పట్టాల్సిన అవసరం ఉంది.  

-  సంపత్ గడ్డం, 
దళిత విద్యార్థి  ఉద్యమ నాయకుడు