మైలార్​దేవ్​పల్లిలో  పార్కు స్థలం కబ్జాకు యత్నం

మైలార్​దేవ్​పల్లిలో  పార్కు స్థలం కబ్జాకు యత్నం
  •     అడ్డుకున్న స్థానికులపై దాడి
  •     ఇద్దరిని అదుపులోకి తీసుకున్న అధికారులు

శంషాబాద్, వెలుగు: రాజేంద్రనగర్ సర్కిల్​లో భూ ఆక్రమణదారులు రెచ్చిపోయారు. పార్కు స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. మైలార్ దేవ్ పల్లి డివిజన్ శాస్త్రి పురం కాలనీలోని సర్వేనంబర్ 134/20 లో 1.34 ఎకరాల్లో పార్క్, ప్లేగ్రౌండ్‌‌‌‌‌‌‌‌ ఉంది. మార్చి 30వ తేదీ గురువారం ఉదయం 5 గంటల ప్రాంతంలో 4 జేసీబీలు, 2 టిప్పర్లతో అక్కడికి చేరుకున్న ఆక్రమణదారులు పార్క్ గోడలను కొంతవరకు కూల్చివేశారు. స్థానికులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారిపై దాడికి పాల్పడ్డారు. దీంతో స్థానికులు జీహెచ్ఎంసీ, ఫారెస్ట్, పోలీస్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ అధికారులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న జీహెచ్ఎంసీ, ఫారెస్ట్ అధికారులు కూల్చివేతలు జరిగిన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. కూల్చివేతలకు పాల్పడ్డ ఫలక్‌‌‌‌‌‌‌‌ నుమాకు చెందిన అసద్, అజ్జు ఖాన్‌‌‌‌‌‌‌‌ లను అదుపులోకి తీసుకున్నారు. జేసీబీలు, టిప్పర్ లతోపాటు వారు వచ్చిన బొలెరో వెహికల్​ను స్వాధీనం చేసుకున్నారు. కబ్జాదారుల వెనుక రాజకీయ నేతల హస్తం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వారు వచ్చిన బొలెరో కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండటం గమనార్హం. మీడియా ప్రతినిధులు న్యూస్ కవరేజ్ చేస్తుండగా ఆ స్టిక్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని తొలగించారు.