లొంగిపోయే ముచ్చటే లేదు.. అమెరికా దాడి చేస్తే కోలుకోలేని దెబ్బకొడ్తం : ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ

లొంగిపోయే  ముచ్చటే లేదు.. అమెరికా దాడి చేస్తే కోలుకోలేని దెబ్బకొడ్తం : ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ
  • ట్రంప్ బెదిరింపులకు భయపడేదే లేదు..
  • మాపై దాడి చేసి ఇజ్రాయెల్​ భారీ తప్పు చేసింది
  • వారిపై కనికరం లేకుండా దాడులు చేస్తూనే ఉంటం
  • ఎవరికో భయపడి యుద్ధం ఆపబోం.. 
  • రక్తానికి రక్తంతోనే సమాధానమిస్తం
  • అమెరికా దాడి చేస్తే కోలుకోలేని దెబ్బకొడ్తం
  • ట్రంప్​కు ఎక్స్​లో ఖమేనీ స్ట్రాంగ్​ కౌంటర్​
  • ఖడ్గంతో కోట గేటు వద్ద ఉన్న వ్యక్తి ఫొటో పోస్ట్​

టెహ్రాన్: అటు ఇజ్రాయెల్​ దాడులు.. ఇటు ట్రంప్ వార్నింగ్​లపై ఇరాన్​ సుప్రీం లీడర్​ అయతుల్లా అలీ ఖమేనీ తీవ్రంగా స్పందించారు. యుద్ధం మొదలైందని, తాము ఎవరికో భయపడి లొంగిపోయే ప్రసక్తే లేదని అన్నారు. ఇరాన్​పై దాడికి దిగి ఇజ్రాయెల్‌‌‌‌ భారీ తప్పిదం చేసిందని తెలిపారు. అందుకు శిక్ష తప్పదని, ఇజ్రాయెల్​ తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని అన్నారు. 

ఇజ్రాయెల్​భీకర దాడులతో ఫ్యామిలీతో కలిసి బంకర్​లోకి వెళ్లిపోయిన ఖమేనీ బుధవారం టెలివిజన్​ ద్వారా వీడియో సందేశం రిలీజ్​ చేశారు. ‘‘జియోనిస్ట్ ప్రభుత్వం పెద్ద తప్పు చేసింది. ఇజ్రాయెల్​ చేసిన తప్పుకు శిక్ష తప్పదు. ఇరాన్​ గడ్డపై చిందిన అమరవీరుల రక్తం మమ్మల్ని ప్రతీకారం తీర్చుకోకుండా ఉండనివ్వదు. రక్తానికి రక్తంతోనే సమాధానమిస్తం. ఇజ్రాయెల్​పై దాడులు చేస్తూనే ఉంటాం” అని హెచ్చరించారు.  

ట్రంప్​ మంగళవారం చేసిన వ్యాఖ్యల​పై ఖమేనీ ఘాటుగా స్పందించారు. అలాంటి  బెదిరింపులకు భయపడబోమనే విషయం ఇరాన్‌‌ చరిత్ర తెలిసిన ఎవ్వరికైనా అర్థమవుతుందన్నారు. ఇజ్రాయెల్–ఇరాన్​ ఘర్షణల్లో అమెరికా సైన్యం కనుక జోక్యం చేసుకుంటే కోలుకోలేని విధంగా దెబ్బకొడ్తామనే విషయం వారు తెలుసుకోవాలని వార్నింగ్​ ఇచ్చారు. మాతృభూమిని కాపాడేందుకు ఇరాన్ సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

ట్రంప్​కు వార్నింగ్​

ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో తమకు తెలుసునని, కానీ ఇప్పట్లో ఆయనను చంపే ఆలోచన లేదంటూ ట్రంప్​ చేసిన వ్యాఖ్యలపై ఖమేనీ స్పందించారు. ‘యుద్ధం మొదలైంది’ అంటూ ఎక్స్​లో పోస్టు చేశారు. ‘‘నమి పేరుతో యుద్ధం స్టార్ట్​అయింది. అలీ తన జుల్ఫికర్‌‌తో(కత్తి) కలిసి ఖైబర్‌‌కు వచ్చేశారు’’ అని అందులో రాశారు. అలాగే, చేతిలో ఖడ్గం పట్టుకొని కోట గేటు వద్ద ఓ వ్యక్తి ఉన్న ఫొటోను ఆ పోస్ట్​కు యాడ్​ చేశారు. కోటపై నిప్పుల వర్షం కురుస్తున్నట్లుగా బ్యాక్​గ్రౌండ్​ఫొటో ఉంచారు. ఏడో శతాబ్దంలో యూదుల పట్టణమైన ఖైబర్​పై షియా ఇస్లాం మొదటి ఇమామ్​ యుద్ధం చేసి.. అందులో విజయం సాధించారు. 

దాన్ని గుర్తుచేస్తూ ఖమేనీ ఈ పోస్ట్ పెట్టారని టైమ్స్ ఆఫ్​ ఇజ్రాయెల్​పేర్కొన్నది. కాగా.. జియోనిస్ట్​ పాలనకు తాము గట్టిగా బదులిస్తామని మరో పోస్ట్​లో ఖమేనీ హెచ్చరించారు. ఎవరిపైనా దయచూపేది లేదని వార్నింగ్​ ఇచ్చారు. అమెరికాతో ఇరాన్​ అధికారులు పరోక్ష చర్చల్లో ఉన్నప్పుడు ఇజ్రాయెల్​తమపై దాడి చేసిందని మండిపడ్డారు. తమనుంచి ఎలాంటి ఇండికేషన్స్​​లేకున్నా వారు అటాక్​ చేశారన్నారు. ఇజ్రాయెల్ దుందుడుకు చర్య వెనుక మొదట అమెరికా ఉందని అనుమానించాం.. ప్రస్తుతం ట్రంప్​ వ్యాఖ్యలు చూస్తుంటే తమ అనుమానాలు నిజమేనని తేలిందన్నారు. ఎవరికో భయపడి తాము యుద్ధం ఆపబోమని, ఇజ్రాయెల్​పై ప్రతిదాడి చేస్తూనే ఉంటామని హెచ్చరించారు. 

ఇరాన్​ సైన్యానికి సర్వాధికారాలు

ఇజ్రాయెల్​తో పెరుగుతున్న ఉద్రిక్తతలు, అమెరికా బెదిరింపుల నేపథ్యంలో ఇరాన్​ సుప్రీం లీడర్​ ఖమేనీ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశ భద్రతకు సంబంధించిన సర్వాధికారాలను ఇరాన్ మిలిటరీ సుప్రీం కౌన్సిల్, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్​(ఐఆర్​జీసీ)కి అప్పగించారు. ఇరాన్ ఇన్‌సైట్ ప్రకారం.. ఖమేనీ, అతని కొడుకు మోజ్తాబాతో సహా ఫ్యామిలీ మెంబర్స్​ అందరూ ఈశాన్య టెహ్రాన్‌లోని భూగర్భ బంకర్‌ లో తలదాచుకుంటున్నారు.

హైపర్ సోనిక్ మిసైల్.. ఫతా-1 

ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ కు చిల్లు పెడుతూ, మొస్సాద్ హెడ్ క్వార్టర్స్ ను పేల్చేసిన ఇరాన్ ఫతా-1 క్షిపణి హైపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ రకానికి చెందినది. ఇరాన్ దీనిని 2003లో లాంచ్ చేసింది. ఫతా అనేది అల్లాకు ఉన్న 99 పేర్లలో ఒకటి. అలాగే దుర్భేద్యమైన విజయాలకు ద్వారాలు తెరిచేది అని కూడా అర్థం. దీనికి ఈ పేరును పెట్టింది ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీయేనని చెప్తారు. 

12 మీటర్ల పొడవైన ఈ క్షిపణి 200 కిలోల పేలుడు పదార్థాలను మోసుకెళ్లి.. గరిష్టంగా1,400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం ఛేదించగలదు. హైపర్ సోనిక్ గ్లైడ్ వెహికల్ తో కూడిన ఫతా-1క్షిపణి ఏకంగా మ్యాక్ 15(సుమారు గంటకు18 వేల కి.మీ.) స్పీడ్​తో ప్రయాణిస్తుందని అంచనా. అందుకే ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ సైతం దీనిని అడ్డుకోలేకపోతోందని చెప్తున్నారు.