చైనా నుంచి భారీగా కాన్సంట్రేటర్లు, ఆక్సిమీటర్లు
హోంకేర్ డివైజ్లకు పెరుగుతున్న డిమాండ్
ముంబై: ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, పల్స్ ఆక్సిమీటర్స్ వంటి కొవిడ్ హోమ్కేర్ డివైజెస్ సప్లయ్ రాబోయే కొద్ది వారాలలో పెరగనుంది. చైనా, హాంకాంగ్ల నుంచి ఛార్టర్డ్, కార్గో ఫ్లైట్లు ఆపరేషన్స్ మొదలవడంతో వాటి లభ్యత ఎక్కువవుతుందని అంచనా వేస్తున్నారు. దేశంలో కొవిడ్ ఇన్ఫెక్షన్స్ భారీగా పెరగడంతో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, పల్స్ ఆక్సిమీటర్స్ దొరక్క ప్రజలు ఇబ్బందిపడుతున్న విషయం తెలిసిందే. మరోవైపు హాస్పిటళ్లలో బెడ్స్ కూడా దొరక్కపోవడంతో ఈ హోమ్కేర్ డివైజెస్ ఇంపార్టెన్స్ మరింతగా పెరిగింది. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, పల్స్ ఆక్సిమీటర్స్ వంటి హోమ్కేర్ డివైజెస్ ప్రొడక్షన్ను ఇప్పటికే చైనా మాన్యుఫాక్చరర్లు పెంచారని దేశంలోని మెడికల్ డివైజెస్ తయారీదారులు, ఇంపోర్టర్లు చెబుతున్నారు.
మొదలవుతున్న ఫ్లైట్ సర్వీసులు...
వారం రోజుల కిందట ఇండియాకు ఫ్లైట్లు ఆపేసిన సిచువాన్ ఎయిర్లైన్స్ (చైనా ఎయిర్లైన్స్) ఈ ఆదివారం నుంచి మళ్లీ సర్వీసులు మొదలెడుతోంది. చాలా మంది కార్గో ఆపరేటర్లూ ఇండియాకు ఫ్లైట్లును సస్పెండ్ చేశారు. చైనా నుంచి సరుకు తీసుకొచ్చేందుకు మన విమానాలను బుక్ చేసుకోవడానికి అనుమతించాలని మరోవైపు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) ప్రభుత్వాన్ని కోరుతోంది. చైనా నుంచి లైఫ్ సేవింగ్ డివైజెస్ను తక్కువ ఖర్చుతో ఇక్కడకు తెచ్చుకోవడానికి ఈ చర్య సాయపడుతుందని బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్ సీఈఓ సునీల్ ఖురానా చెప్పారు. ఛార్టర్డ్ ఫ్లయిట్లు మొదలయినప్పటికీ, కొన్ని కార్గో ఫ్లయిట్లను కారియెర్లు చివరి నిమిషంలో క్యాన్సిల్ చేస్తున్నారని ఆయన అన్నారు. కస్టమర్లకు తాము డెలివరీ ఇస్తామని హామీ ఇవ్వడంతో ఇది తమకు సమస్యగా మారుతోందని చెప్పారు. ఏమైనా, రాబోయే వారాలలో చైనా నుంచి సప్లయ్లు మరింత మెరుగుపడతాయని పరిశ్రమ వర్గాలు ఆశాభావంతోనే ఉన్నాయి. కార్పొరేట్లు, ఎన్జీఓలు, వ్యక్తులు కూడా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు కొనుగోలుకు ఇబ్బడిముబ్బడిగా ఆర్డర్లు పెట్టడంతో సప్లయ్ చెయిన్, లాజిస్టిక్స్, ఎయిర్లైన్స్ మీద ఒత్తిడి పెరిగింది. ప్రతీ రెండో రోజూ ఒక ఆక్సిజన్ డివైజ్ల కన్సైన్మెంట్ ఇండియాకి వచ్చేలా ఇంపోర్టర్లు ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. దేశంలో అలాంటి డివైజ్ల గిరాకీ అమాంతం సప్లయ్ని మించిపోయింది. అయితే, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లుకు కన్సూమర్లు గతంలో కంటే రూ. 3 నుంచి 10 వేలు ఎక్కువ చెల్లించాల్సి రావచ్చునని అంటున్నారు. ఎందుకంటే చైనా సప్లయర్లు వాటి రేట్లను పెంచేసినట్లు ఇంపోర్టర్స్ చెబుతున్నారు. దానికితోడు రవాణా వ్యయం కూడా పెరిగిందని అంటున్నారు. చైనా కంపెనీల నుంచి ఆక్సిమీటర్స్ కొనడానికి గతంతో పోలిస్తే మూడు నుంచి ఆరు డాలర్లు ఎక్కువ వెచ్చించాల్సి వస్తోందని, దీంతో రేట్లు పెరగడం తప్పనిసరని పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. ఫ్లయిట్లు మొదలవడంతో ఇప్పుడు ప్రతి రెండో రోజూ ఒక కన్సైన్మెంట్ వస్తోందని గిజ్మోర్ సీఈఓ సంజయ్ కలిరోనా చెప్పారు. ఇళ్లలో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల సప్లయ్ కొంత మెరుగుపడినప్పటికీ, ఎక్కువ ఆక్సిజన్ డెలివరీ చేసే యూనిట్లు రావడానికి మాత్రం ఇంకో 20 రోజులు పట్టొచ్చని ఆయన వెల్లడించారు.