
పంటచేన్లలో రోజూ కనిపించేవే.. వీటికి జిల్లేడు, బొంబై మిడతలని పేరు
ఫారిన్ మిడతలు దండుగా వస్తయ్.. ఆఫ్రికా, ఇరాన్ దేశాల నుంచి వలస
హైదరాబాద్, వెలుగు: ఎడారి మిడతలు మన రాష్ట్రంలోకి వచ్చిపడ్డాయంటూ సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియోలు నిజం కాదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మన రాష్ట్రంలో కనిపిస్తున్న మిడతలు పక్కా లోకల్ అని చెబుతున్నారు. ఎడారి మిడతలు, లోకల్ మిడతలు రెండూ వేర్వేరని.. మన దగ్గరున్న మిడతలతో పంటలకు పెద్దగా ప్రమాదంలేదన్నారు. లోకల్ మిడతల ఫొటోలు, వీడియోలతో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మి ఆందోళన చెందొద్దని రైతులకు సూచించారు. రెండు వారాల క్రితం పాకిస్తాన్ నుంచి మనదేశంలోకి వచ్చిన మిడతలు ఇప్పటికే లక్షలాది ఎకరాల పంటలను నాశనం చేశాయి. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మీదుగా మిడతల దండు మహారాష్ట్రకు చేరాయి. ఇవి మన రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోకి ప్రవేశించాయని ప్రచారం జరిగింది. మన రాష్ట్రంలోని పంటచేలు, జిల్లేడు చెట్లపై కనిపించే మిడతలను వీడియో తీసి, సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్గా మారింది. ఈ వీడియోలతో రైతుల్లో ఆందోళన నెలకొంది. దండుగా వచ్చే ఎడారి మిడతలు, మన దేశంలో ఉండే మిడతల మధ్య తేడాలు తెలియక చాలామంది కన్ఫ్యూజ్కు గురవుతున్నారు.
ఎడారి మిడతలంటే..
ఇతర దేశాల నుంచి దండుగా వస్తున్న మిడతలనే ఎడారి మిడతలు అంటారు. ఇవి ఆఫ్రికా, ఇరాన్, పాకిస్తాన్ దేశాల్లో పుట్టి ఖండాంతరాలకు ప్రయాణిస్తుంటాయి. అత్యంత వినాశకారిగా పేరున్న ఈ మిడతలు రోజుకు గాలివాటంలో 100 కిలోమీటర్ల వరకూ వెళుతుంటాయి. ఈ మిడతల లైఫ్ సైకిల్ మూడు దశలుగా ఉంటుంది. గుడ్డు దశ, అపరిపక్వ(రెక్కలులేని) దశ, ప్రౌఢ(రెక్కలున్న) దశలు. తేమగా ఉండే నేలల్లో ఆడ మిడతలు గుడ్లు పెడతాయి. వీటిలో నుంచి రెండు వారాల్లో పిల్ల పురుగులు(రెక్కలు లేని) వస్తాయి. ఇవి అయిదారు వారాల్లో అన్ని రకాల పంటలను, చెట్ల ఆకులను, గడ్డిని తింటూ అయిదారుసార్లు కుబుసం(పాత చర్మం) విడుస్తూ పరిమాణాన్ని విపరీతంగా పెంచుకుంటూ, చివరి కుబుసం విడిచే దశ తర్వాత రెక్కలున్న పెద్ద మిడతలుగా మారతాయి. ఒక్కో దండులో ఐదారు కోట్ల మిడతలు ఉంటాయి.
మన దేశంలో జిల్లేడు, బొంబై మిడతలు..
దేశంలోని పంట చేలల్లో మిడతలు రోజూ కనిపిస్తుంటాయి. ఇందులో జిల్లేడు, బొంబై మిడతలతోపాటు మరికొన్ని రకాల మిడతలు ఉన్నాయి. జిల్లేడు మొక్కలపై జీవించడం వల్ల వీటిని జిల్లేడు మిడతలు అంటారు. ఆకుపచ్చ రంగులో ఉండి పసుపు పచ్చ గీతలు ఉంటాయి. వేరే రకాల మొక్కలపై లేదా పంటలపై ఇవి వాలవు. బొంబాయి మిడత మరో రకం మిడత. ఇది సాధారణంగా అన్ని రకాల మొక్కలపై కనిపిస్తుంది. 1927కు ముందు ఈ మిడతలు దండు రూపంలో తిరిగేవని ఆ తర్వాత అలా రాలేదని సైంటిస్టులు గుర్తించారు. మన దేశంలో వీటితో పాటు పెద్దగా నష్టం కలిగించని ఇతర రకాల మిడతలు చాలా ఉన్నాయని తెలిపారు.
గాలివానతో మిడతల రూట్మారింది
మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్ వైపు ప్రయాణం
గాలివానతో మిడతలు రూట్ మార్చాయి. మహారాష్ట్రలోని గోదావరి పరివాహక ప్రాంతం మీదుగా భూపాలపల్లి జిల్లాలోకి ప్రవేశిస్తాయని భావించిన మిడతలు శుక్రవారం కురిసిన గాలివానతో మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్రాష్ట్రాల వైపు మళ్లినట్లు అధికారులు గుర్తించారు. భూపాలపల్లి జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి సుమారు 2 గంటలపాటు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గోదావరి తీరంలోని మహదేవ్పూర్, పలిమెల మండలాలలో కూడా భారీ వర్షం పడింది. మిడతలు ఎప్పుడు వచ్చినా వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధమని, పురుగు మందులను కూడా రెడీ చేశామని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పారు.
గోదావరి తీరంలో హెలికాప్టర్తో నిఘా
మిడతల దండు నివారణకు, తెలంగాణలోకి రాకుండా అడ్డుకునేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్లు నిపుణుల బృందం పేర్కొంది. శనివారం రాత్రి రామగుండం ఎన్టీపీసీలో ఫారెస్ట్, అగ్రికల్చర్, హార్టి కల్చర్ విభాగాలకు చెందిన అధికారులతో నిపుణుల బృందం, మంచిర్యాల కలెక్టర్ భారతి సమీక్ష నిర్వహించారు. మధ్యాహ్నం హెలికాప్టర్తో రాష్ట్ర సరిహద్దులు, గోదావరి తీరం వెంబడి నిపుణుల బృందం జరిపిన పరిశీలనలో గుర్తించిన అంశాలపై ఈ సమీక్షలో చర్చించారు. ప్రస్తుతం మహారాష్ట్రలోని వార్దా అడవుల్లో ఉన్న మిడతలు మన రాష్ట్రంలోకి ప్రవేశిస్తే ఎదుర్కోవడానికి హైపోక్లోరైడ్ ద్రావణం, చల్లడానికి స్ప్రేయర్లను సిద్ధంగా ఉంచారు. మిడతల దండును అడ్డుకునేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని కలెక్టర్ భారతి సూచించారు.
For More News..
వేర్వేరుగా ఇంటర్ రిజల్ట్స్