
రెండు రోజల క్రితం హైదరాబాద్లో... ‘యునైటెడ్ నేషన్స్ జియోస్పేస్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్’ మొదలైంది. అక్కడికి వచ్చిన కొందరి చేతిలో డ్రోన్ కెమెరాలు ఉన్నాయి. వాళ్లందరూ లైసెన్స్ ఉన్న డ్రోన్ పైలట్స్. వాళ్లలో ఆరుగురు మహిళలు కూడా ఉన్నారు. క్యూరియాసిటీతో, కెరీర్ బాగుంటుందని, ఎంట్రప్రెనూర్ అవ్వొచ్చని... డ్రోన్ పైలట్ లైసెన్స్ తీసుకున్నారు వీళ్లు. ఈ ఆరుగురూ మన హైదరాబాద్లోని తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీలో డ్రోన్ పైలట్ సర్టిఫికెట్ కోర్స్ చేశారు.
డ్రోన్ సర్వే, మ్యాపింగ్, మైనింగ్, సైట్ అసిస్టెంట్, ఏరియల్ ఫొటోగ్రఫీతో పాటు వ్యవసాయంలో కూడా డ్రోన్ పైలట్స్ అవసరం చాలా ఉంది. అందుకని ఈమధ్య చాలామంది ఈ కోర్సు నేర్చుకుంటున్నారు. డ్రోన్ని... రిమోటెలి పైలటెడ్ ఎయిర్క్రాఫ్ట్ (ఆర్పిఎ) అని పిలుస్తారు. కారు, బైక్ నడపాలంటే లైసెన్స్ ఉండడం ఎంత ముఖ్యమో, డ్రోన్ని ఎగరేయాలన్నా కూడా పైలట్ లైసెన్స్ ఉండడం అంతే ముఖ్యం. అందుకని డ్రోన్ పైలట్ సర్టిఫికెట్ కోర్సు చేయడం తప్పనిసరి. మనదేశంలో 31 సంస్థలు రిమోట్ డ్రోన్ పైలట్ కోర్సు అందిస్తున్నాయి. హైదరాబాద్లో ఇలాంటి సంస్థలు మూడు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 12 మంది మహిళా డ్రోన్ పైలట్స్ ఉన్నారు. వీళ్లలో ఆరుగురు మన హైదరాబాద్లోనే ట్రైనింగ్ తీసుకున్నారు. అంతేకాదు వీళ్లలో మన రాష్ట్రానికి చెందిన వాళ్లు ఇద్దరు ఉండడం విశేషం.
మొదటిసారి పట్టుకుంది
హైదరాబాద్కి చెందిన ప్రియదర్శిని సురేష్.. ఇండి యన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లో రీసెర్చర్. మనదేశంలో మొదటిసారి డ్రోన్ల ద్వారా మెడిసిన్స్ డెలివరీ చేసే ప్రాజెక్ట్కు పనిచేసింది. వికారాబాద్లో డ్రోన్ల సాయంతో మెడిసిన్స్ కూడా అందించింది. అప్పుడే ఆమె మొదటిసారి డ్రోన్ని పట్టుకుంది. దాన్ని గాల్లో ఎగరేయడం నేర్చుకుంది. డ్రోన్ టెక్నాలజీ ఆమెకు బాగా నచ్చింది. దాంతో సర్టిఫికెట్ కోర్స్ చేసి, డ్రోన్ పైలట్ లైసెన్స్ తెచ్చుకుంది.
డ్రోన్ కంపెనీ పెట్టాలనే ఆలోచనతో..
హైదరాబాద్లో ఉంటున్న అర్చనా పెండ్యాల డ్రోన్ టెక్నాలజీ గురించి ఏ వార్త వచ్చినా ఆసక్తిగా చదివేది. భర్తకు ఎలక్ట్రికల్ వెహికల్స్ షాప్ ఉంది. భర్తను చూసి తను కూడా సొంతంగా బిజినెస్ చేయాలనుకుంది. ఎంట్రప్రెనూర్గా డ్రోన్ బిజినెస్లో రాణించాలనుకుంది. అందుకు డ్రోన్ పైలట్ లైసెన్స్ తప్పనిసరి. దాంతో డ్రోన్ పైలట్ కోర్సు చేసింది ‘‘భవిష్యత్తు అంతా డ్రోన్స్దే. అందుకని డ్రోన్ కంపెనీ పెట్టాలనే ఆలోచన ఉంది’’ అని చెప్తోంది అర్చన.
250 ఎకరాల పొలం చూసుకుంటోంది
గుంటూరుకు చెందిన జి. అనూషకు ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఇష్టం. పాలిటెక్నిక్ చదివింది. కరోనా టైంలో జాబ్ పోవడంతో ఊళ్లో ఆర్గానిక్ ఫార్మింగ్ మొదలు పెట్టింది. ఎరువులు చల్లడం, పంటని గమనించడం వంటి పనులకు డ్రోన్ ఉపయోగించేది. దాంతో డ్రోన్ పైలట్ లైసెన్స్ కోసం అప్లై చేయమని వాళ్ల అంకుల్ సజెస్ట్ చేశాడు. హైదరాబాద్లో ట్రైనింగ్ తీసుకుంది. లైసెన్స్ ఉండడంతో అగ్రికల్చర్ కంపెనీలో డ్రోన్ ఆపరేటర్గా జాబ్ వచ్చింది. అక్కడ 250 ఎకరాల పొలాన్ని డ్రోన్ టెక్నాలజీ సాయంతో తను ఒక్కతే చూసుకుంటోంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లకు డ్రోన్ పైలట్ ట్రైనింగ్ ఇవ్వాలి అనుకుంటోంది.
రీసెర్చ్ కోసం..
ఛత్తీస్గఢ్కి చెందిన సునీతా చౌధురీ ఇక్రిశాట్లో సైంటిస్ట్. పై చదువులకు అమెరికా వెళ్లి మనదేశానికి తిరిగొచ్చింది. ‘క్లైమేట్–స్మార్ట్ అగ్రికల్చర్ ఫీల్డ్’లో సిస్టమ్ అనలైజర్గా చేరింది. రీసెర్చ్ కోసం తరచుగా డ్రోన్లు ఉపయోగించేవాళ్లు. అయితే, వాళ్లలో లైసెన్స్ ఉన్న డ్రోన్ పైలట్ లేకపోవడంతో బయటినుంచి డ్రోన్ పైలట్స్ని పిలిచేవాళ్లు. ప్రతిసారి వాళ్లకు వేల రూపాయలు ఇవ్వాల్సి వచ్చేది. దాంతో ఆ లైసెన్స్ తెచ్చుకుంటే తనే డ్రోన్ పైలట్ కావొచ్చు అనుకుంది సునీత. ఇంకేం... టిఎస్ఏఏలో కోర్సు చేసింది. ఇప్పుడు ఆమె తన రీసెర్చ్ కోసం డ్రోన్ కెమెరాని వాడుతోంది. అట్లనే డ్రోన్ టెక్నాలజీ మీద క్యూరియా సిటీతో పైలట్ కోర్సు చేసింది మరో అమ్మాయి భవతరణి బాలాజి. చెన్నైకి చెందిన ఈమె గుజరాత్లోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూని వర్సిటీలో ఎంబీఏ చదువుతోంది.
రెండొందలమందికి పైగా...
‘‘డ్రోన్ పైలట్ కోర్సు నేర్చుకునేం దుకు పదో క్లాస్ పాస్ అయితే చాలు. ఐదు రోజుల కోర్సు ఉంటుంది. ఫీజు: రూ. 48 వేలు. మొదటి మూడు రోజులు... డ్రోన్ని ఎలా ఎగరేయాలి? ఎంత ఎత్తులో ఎగరేయాలి? డ్రోన్ ఎలా పనిచేస్తుంది? అనే విషయాలు చెప్తాం. డ్రోన్ని ఎగరేసేటప్పుడు ఏదైనా సమస్య వస్తే... రిపేర్ చేసుకునేలా ట్రైనింగ్ ఇస్తాం. అంతేకాదు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) గైడ్లైన్స్ వివరంగా చెప్తాం. చివరి రెండు రోజులు డ్రోన్ ఫ్లయింగ్ నేర్పిస్తాం. రెండేండ్ల క్రితం డ్రోన్ పైలట్ ట్రైనింగ్ని మొదలుపెట్టాం. ఇప్పటివరకు దాదాపు 200 మంది పైలట్ లైసెన్స్ పొందారు. వీళ్లలో మనరాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల వాళ్లు కూడా ఉన్నారు’’.
- రాహుల్ రెడ్డి, ఆపరేషన్స్ మేనేజర్, ఇన్స్ట్రక్టర్, టిఎస్ఏఏ.
::: సంతోష్ బొందుగుల