బిల్డింగ్ వెనుక గోడకు కన్నమేసి బ్యాంక్ లో చోరీకి విఫలయత్నం

బిల్డింగ్ వెనుక గోడకు కన్నమేసి బ్యాంక్ లో చోరీకి విఫలయత్నం
  •     సీసీ కెమెరాలను పగలగొట్టి తీసుకెళ్లిన దుండగులు
  •     కుమ్రం భీమ్​ జిల్లా రవీంద్రనగర్​-1 తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో ఘటన
  •     నగదు, బంగారం పోలేదన్న ఎస్పీ సురేశ్​కుమార్​ 

కాగజ్ నగర్,వెలుగు : కుమ్రం భీమ్​ ఆసిఫాబాద్​ జిల్లా చింతలమానేపల్లి మండలం రవీంద్రనగర్–1 లోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో దొంగలు చోరీకి విఫలయత్నం చేశారు. గురువారం అర్ధరాత్రి బ్యాంక్ బిల్డింగ్ వెనుక గోడకు రంధ్రం చేసి చొరబడ్డారు. డబ్బులు, బంగారం పెట్టిన స్ట్రాంగ్ రూమ్​ను గ్యాస్ కట్టర్లతో కట్ చేసేందుకు యత్నించారు. అది పూర్తిగా కట్ కాకపోవడంతో విరమించుకున్నారు. తమ గురించి ఎక్కడ బయటపడుతుందోనని బ్యాంక్ లోని సీసీ కెమెరాలు, హార్డ్ డిస్క్ ఎత్తుకెళ్లారు. శుక్రవారం ఉదయం బ్యాంక్ కు వచ్చిన బీఎం రవీందర్ రెడ్డి వెనుక గోడ పగులగొట్టి ఉండడం గమనించాడు. ఎస్ఐతో పాటు బ్యాంక్ ఆర్​ఎం కు కాల్​చేసి చెప్పాడు. దీంతో పోలీసులతో పాటు ఎస్పీ సురేశ్​ కుమార్ స్పాట్ కు చేరుకొని పరిశీలించారు. ఎస్​పీ మాట్లాడుతూ బ్యాంక్ లో నగదు, బంగారం సేఫ్ గా ఉన్నాయని, దొంగలు సీసీ కెమెరాలు, హార్డ్ డిస్క్ తో పాటు మరికొన్ని వస్తువులు ఎత్తుకెళ్లారని చెప్పారు. కాగజ్ నగర్ డీ ఎస్పీ కరుణాకర్, కౌటాల సీఐ బుద్దే స్వామి, ఎస్ఐలు విజయ్, రమేశ్, ప్రవీణ్ కుమార్, వెంకటేశ్, రాకేశ్​ఉన్నారు.