
ముస్తాబాద్ వెలుగు : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని నాగంపేట గ్రామంలో శనివారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఒకే రోజు తాళం వేసి ఉన్న 10 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. దొంగలు దాదాపుగా 6 తులాల బంగారం, 50 తులాల వెండి, రూ. 25 వేల నగదును ఎత్తుకెల్లినట్లు తెలిసింది. స్థానికులు అందించిన వివరాల ప్రకారం... నాగంపేట గ్రామంలో తాళం వేసి ఉన్న గురుక లక్ష్మి ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లోకి గుర్తుతెలియని దుండగులు చొరబడి లాప్టాప్ ని ఎత్తుకెళ్లారన్నారు.
అనంతరం మంగలి పొల్తూరి అంజయ్య ఇంట్లో దొంగలు బీరువా పగలగొట్టి, రెండు తులాల బంగారం, 30 తులాల వెండిని ఎత్తుకెళ్లారు. ఎస్ఐ ప్రేమానందం ఆదివారం సంఘటన స్థలాలను పరిశీలించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.