ఇండియాలో మూడో కరోనా కేసు నమోదు

ఇండియాలో మూడో కరోనా కేసు నమోదు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వల్ల దేశ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురి అవుతున్నారు.  ఇప్పటికే కేరళలో కరోనా వైరస్ బారిన పడి ఇద్దరు చికిత్స పొందుతున్నారు. తాజాగా ఈ సంఖ్య మూడుకు చేరింది. కేరళలో మరో కేసు నమోదైనట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ అధికారికంగా ధృవీకరించారు. కేరళ కాసర్‌గోడ్ జిల్లాలో ఈ కేసు నమోదైంది. ప్రస్తుతం బాధితుడిని ప్రత్యేకంగా ఓ వార్డులో పెట్టి చికిత్స అందిస్తున్నారు.

ఈ మహమ్మారి వ్యాపించకుండా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మంత్రులు చెబుతున్నారు. కానీ రోజుల వ్యవధిలోనే ఈ వైరస్ ముగ్గురు వ్యక్తులకు సోకడంతో కేరళ ప్రజలతో పాటు మిగతా రాష్ట్రాల వారు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.