వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లాలో మొదటి, రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినట్టే.. మూడో విడతను కూడా అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. ఈ నెల 17న పరిగి నియోజకవర్గంలోని పరిగి, కుల్కచర్ల, పూడూర్, చౌడాపూర్, దోమ మండలాల్లో జరిగే ఎన్నికల ఏర్పాట్లపై సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
జిల్లా అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, ట్రైనీ కలెక్టర్ హర్ష చౌదరి, మండల స్పెషల్ అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లతో కలిసి రివ్యూ చేశారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మెటీరియల్ పంపిణీ ప్రణాళికాబద్ధంగా జరగాలని, పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు ఉండేలా చూడాలన్నారు.
రీ కౌంటింగ్ అవసరం లేకుండా సరైన పద్ధతిలో కౌంటింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డీఆర్డీవో శ్రీనివాస్, డీఆర్వో మంగీలాల్, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
