బ్లూమ్బెర్గ్ బిజినెస్ ఫోరంలో విదేశీ కంపెనీలకు పీఎం మోడీ పిలుపు
న్యూయార్క్: ‘‘మీ దగ్గర టెక్నాలజీ ఉంది, మా దగ్గర యంగ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఇద్దరం కలిస్తే బిజినెస్ కూడా బాగా సాగుతుంది. రండి.. ఇండియాలో పెట్టుబడులు పెట్టండి.. కార్పొరేట్ ట్యాక్స్ను కూడా భారీగా తగ్గించేశాం.. ఈ గోల్డెన్ ఆపర్చునిటీని వదులుకోకండి..’’అంటూ విదేశీ పారిశ్రామికవేత్తలకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. న్యూయార్క్లో బుధవారం జరిగిన బ్లూమ్బెర్గ్ బిజినెస్ ఫోరంలో 40కిపైగా విదేశీ కంపెనీల సీఈవోలతో రౌండ్టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.
కొత్తగా ఏదైనా చేద్దామనుకునే కంపెనీలకు ఇండియా ఆకర్షణీయ మార్కెట్అని, స్టార్టప్ల్లో పెట్టుబడులకు కూడా చాలా అవకాశాలున్నాయని, కోల్మైనింగ్లో 100 శాతం ఎఫ్డీఐలకు అనుమతిచ్చామని తెలిపారు. ఇండియాను 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తయారుచేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని, గత ఐదేండ్లలో 286 బిలియన్ డాలర్ల ఎఫ్డీఐలు వచ్చాయని, రాబోయే రోజుల్లో మోడ్రన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై భారీమొత్తంలో 1.3 ట్రిలియన్ డాలర్లు ఖర్చుచేయబోతున్నామని, ఈజ్ ఆఫ్ బిజినెస్ కోసమే 50కిపైగా పాత చట్టాలను రద్దుచేశామని, కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు కూడా కంపెనీలకు కలిసొచ్చే అంశమని వివరించారు.