ఎనిమిదేళ్ల తర్వాత ‘మహాసముద్రం’తో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్న సిద్ధార్థ్.. ఈ సినిమా తన ఇమేజ్ని మార్చేస్తుం దంటున్నాడు. శర్వానంద్తో కలిసి అజయ్ భూపతి డైరెక్షన్లో తను నటించిన ఈ మూవీ ఈ నెల 14న రిలీజవుతోంది. ఈ సందర్భంగా సిద్ధార్థ్ చెప్పిన సంగతులు.
‘‘ఇలాంటి కాంబినేషన్ కోసం మూడు, నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నా. ఇప్పటికి సెట్టయ్యింది. కథ వినగానే ఓకే చెప్పేశా. ‘ఆర్ఎక్స్ 100’తో మంచి పేరు తెచ్చుకున్నాడు అజయ్. ఈసారి కూడా మంచి స్ర్కిప్ట్ని సెలెక్ట్ చేసుకున్నాడు. రియలిస్టిక్గా ఉండే బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. సుభాష్ ఘాయ్ తీసే ఎమోషనల్ యాక్షన్ డ్రామాల్లాగ ఉంటుంది. నట విశ్వరూపం చూపించే క్యారెక్టర్ నాది. సిద్ధు అనగానే తెలుగు ప్రేక్షకులు చాక్లెట్ బాయ్ అంటుంటారు. ఆ ఇమేజ్ని ఈ సినిమా మార్చేస్తుంది. నాకిది పర్ఫెక్ట్ కమ్బ్యాక్. కొంతమంది డైరెక్టర్స్ ఫ్యాన్స్ కోసమే సినిమాలు తీస్తారు. మరికొందరు మాస్ సినిమాలు తీసి ఫ్యాన్స్ని క్రియేట్ చేస్తారు. అజయ్ రెండోది తీశాడు. ప్రతి లాంగ్వేజ్లో నాకొక ఐకానిక్ హిట్ ఉంది. తెలుగులో బొమ్మరిల్లు, తమిళంలో బోయ్స్, హిందీలో రంగ్దే బసంతి.. ఇలా. వీటి ద్వారా నన్ను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు. కానీ నన్ను స్టార్ని చేసింది తెలుగు ఆడియెన్సే. అందుకే ఎక్కడికెళ్లినా తెలుగు స్టార్ననే చెబుతాను. బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చినవాణ్ని కాబట్టి నాలాంటి వాళ్లను సపోర్ట్ చేసేందుకు ప్రొడక్షన్ కంపెనీని స్టార్ట్ చేశాను. ప్రస్తుతం అన్ని భాషల్లో కలిపి ఎనిమిది సినిమాలు రెడీ అవుతున్నాయి. రెండేళ్ల తర్వాత డైరెక్షన్ చేస్తాను. స్ర్కిప్ట్ రెడీ చేస్తున్నాను. మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా, శంకర్ దర్శకత్వంలో హీరోగా పరిచయమైన నేను వాళ్ల దగ్గర చాలా నేర్చుకున్నాను. ఆ అనుభవంతోనే సినిమా తీస్తాను. అలాగే నాలుగు సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాను. రెండు తెలుగు సినిమాలు కూడా చేయాల్సి ఉంది. ఇక అందరూ అనుకుంటున్నట్టు నేనీమధ్య లండన్ వెళ్లింది సర్జరీ కోసం కాదు. షూటింగ్లో చిన్న గాయమైతే ట్రీట్మెంట్కి వెళ్లానంతే.’’