కాళేశ్వరం కంటే ఇవి నయం!

కాళేశ్వరం కంటే ఇవి నయం!

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నీళ్లు, నిధులు, నియామకాలు అనే జయ శంకర్ సార్​ ఉద్యమ నినాదాన్ని కేసీఆర్.. రాజకీయ నినాదంగా మార్చి, తెలంగాణ ప్రజల్లో ఒక ఆలోచన ధోరణి రేకెత్తించారు. కానీ కేసీఆర్ మదిలో ఉన్నది ఒకటి, తెలంగాణ ప్రజలు అనుకున్నది మరొకటి. వారు నిర్మించిన ప్రపంచంలోని అతి పెద్ద భారీ లిఫ్ట్ ఇరిగేషన్, అతి తక్కువ ఖర్చుతో నిర్మించిన దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్, ఒక లిఫ్ట్ లేకుండా  ‘0’ ఖర్చుతో మొదలెట్టిన ఎస్ఎల్​బీసీ టన్నెల్ ప్రాజెక్టులైన మూడు ఇరిగేషన్ పథకాలను విశ్లేషిద్దాం. 

రూ.30 వేల కోట్ల బడ్జెట్ తో ప్రాణహిత -చేవెళ్లగా మొదలైన ప్రాజెక్టు.. కేసీఆర్ మేధో సంపత్తితో  కాళేశ్వరం ప్రాజెక్టుగా మారి, పూర్తయ్యేనాటికి రూ. రూ.1.2  నుంచి1.5 లక్షల కోట్ల బడ్జెట్ కు చేరుతుంది. కేసీఆర్ కాళేశ్వరంలో 3 చెక్ డ్యాములుంటాయి.. గోదావరి నుంచి నీళ్లు ఎత్తి, మళ్లీ గోదావరిలోనే పోయడం. ఈ డీపీఆర్​కు వాప్కోస్ సంస్థను వాడటం, చివరకు ఆ సంస్థ చైర్మన్ అవినీతి ఆరోపణలతో సస్పెండ్​ కావడం గమనార్హం. ప్రాణహిత దగ్గర100 నుంచి120 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయని,  గోదావరి( ప్రాణహిత కలిసిన తర్వాత) 200 టీఎంసీలు ఎత్తి పోయొచ్చని కేసీఆర్ అందరినీ నమిచ్చారు. కానీ ఇప్పటి వరకు మనం చూసిన నిజాలు అలా లేవు. ప్రాణహిత  (తుమ్మిడిహట్టి) దగ్గర బ్యారేజీ కడితే తక్కువ ఖర్చు అయ్యేది. అదీగాక ఎత్తిపోస్తామని చెప్పినన్ని నీళ్లు ఎత్తి పోయలేదు. ప్రాజెక్టు కట్టిన తర్వాత కూడా ఏటా మేడిగడ్డ బ్యారేజీ దాటి 3000 నుంచి 4000 టీఎంసీల నీళ్లు సముద్రం పాలు అవుతున్నాయి. కాళేశ్వరం పరిస్థితి ఆపరేషన్ సక్సెస్ - పేషెంట్ డెడ్ లాంటిది. ఒక ఎకరా నీళ్లు ఎత్తడానికి 5 లక్షల ఖర్చు అవుతుందని కాగ్​ నివ్వెరపోయింది. పొలాలకు నీళ్లు రాకున్నా..  కాళేశ్వరం వల్ల మంచిర్యాల జిల్లాలో పంట పొలాలు మునిగాయి. అంతిమంగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు నీళ్లొచ్చినయి.. తెలంగాణ ప్రజలకు1.5 లక్షల కోట్ల భారం మిగిలింది. 

దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్

దేవాదుల మొదటి, రెండో దశ కలిపి ఇప్పటి వరకు దాదాపు రూ.3000 కోట్లు అయ్యింది. గతంలో సీమాంధ్ర నాయకుల పాలనలో తెలివిగా ప్రాజెక్ట్ కట్టారు కానీ, ఇన్​టేక్ వెల్ 74 మీటర్ల దగ్గర పెట్టడం వల్ల, కేవలం వరద ఉన్నప్పుడు తప్ప, నీరు లిఫ్ట్ చెస్ అవకాశం చాలా తక్కువ. 60 టీఎంసీలతో 6.20 లక్షల ఎకరాలు నూతన ఆయకట్టుకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టు ఎప్పుడూ 20 టీఎంసీ నీళ్ల కంటే ఎక్కువ లిఫ్ట్ చేయలేదు. ఇప్పుడు సమ్మక్క బ్యారేజీ ద్వారా రూ. 2121 కోట్ల బడ్జెట్ తో 85 మీటర్ల ఎత్తు ఉన్న బ్యారేజి నిర్మించడం వల్ల100 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేసే అవకాశం ఏర్పడ్డది. అలాగే 240 మెగా వాట్ల హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ నిర్మాణమైంది. దేవాదుల దగ్గర గోదావరిలో 360 రోజులు నీళ్లు అందుబాటులో ఉంటాయి. అంటే కేవలం రూ. 2121 కోట్ల బ్యారేజీ నిర్మాణంతో 100 టీఎంసీల నీళ్లు, 6.20 లక్షల దేవాదుల ఆయకట్టు, 6 లక్షల ఎస్సార్​ఎస్పీ 2 ఆయకట్టు స్థిరీకరణ, తాగు నీరు, పరిశ్రమలకు నీళ్లు, 240 మెగా వాట్ల కరెంటు ఉత్పత్తి. ఈ  ప్రాజెక్టు కింద ఒక పెద్ద రిజర్వాయర్ కూడా లేదు. రూ.2000 కోట్లతో 20 టీఎంసీల రిజర్వాయర్ కట్టి ఉంటే.. చిన్న చిన్న రిజర్వాయర్ల సామర్థ్యం పెంచి ఉంటే ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండ, కరీంనగర్, ఖమ్మం.. చివరకు తపాస్​పల్లి ద్వారా  సిద్దిపేట వరకు నీళ్లు పోయే అవకాశం ఉండే. ఎక్కడా ప్రచారం లేదు. ఎందుకంటే రూ. 1.20 లక్షల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం, రూ. 2121( టెండర్ పలికింది రూ.1900 )కోట్లతో 12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తున్న దేవాదుల మధ్య పోలికల చర్చ జరుగుతుందని ప్రభుత్వం చాప కింద నెట్టేసింది

ఎస్ఎల్​బీసీ టన్నెల్​ ప్రాజెక్టు

శ్రీశైలం నుంచి గ్రావిటీ ద్వారా 4 లక్షల ఎకరాలకు నీళ్లు అందించేందుకు 2004 లో చేపట్టిన ప్రాజెక్టు ఇది. కేవలం రూ. 2800 కోట్లతో 51 కిలోమీటర్ల టన్నెల్ ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాకు 40 టీఎంసీల నీళ్లు రావడం ఒక వరం. ఇప్పటి వరకు 43 కిలోమీటర్లు టన్నెల్ పూర్తయింది. కేవలం 8 నుంచి-11 కిలోమీటర్ల టన్నెల్ పెండింగ్ లో ఉంది. అందుకు కావాల్సింది రూ.500 కోట్లు. కానీ కేసీఆర్ దానికి నిధులు ఇవ్వరు. శ్రీశైలంలోని 826 అడుగుల వద్ద నుంచి గ్రావిటీ ద్వారా 4 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే  ఇంత అద్భుత ప్రాజెక్టును కేసీఆర్ ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నట్లు? ఉమ్మడి రాష్ట్రంలో మొదలు పెట్టిన ప్రాజెక్ట్​అనా? తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం జరుగుతుంది కాబట్టి.. కాళేశ్వరంతో పోల్చుతారనా? లేదా తన మిత్రుడు జగన్ మెప్పు కోసమా? 10 కిలోమీటర్ల టన్నెల్ పూర్తి చేయడానికి 9 ఏండ్లు పడుతుందా? తెలంగాణ ప్రజలే ఆలోచించాలి.  రూ. 1.20 లక్షల కోట్లతో ఎంత ఆయకట్టుకు నీళ్లు వస్తున్నాయో తెలియని కాళేశ్వరం ఒకవైపు, కేవలం రూ. 2121 కోట్లతో12 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే దేవాదుల, రూ. 500 కోట్లతో గ్రావిటీ ద్వారా 4 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే ఎస్ఎల్ బీసీ టన్నెల్ ప్రాజెక్టుల మధ్య మంత్రం, తంత్రం ఏమిటో చర్చ జరగాలి. 

- డా.బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎంపీ, భువనగిరి