
జన్నారం, వెలుగు: బైక్ దొంగతనాలకు పాల్పపడుతున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్ తెలిపారు. బుధవారం జన్నారం పోలీస్ స్టేషన్లో మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్ తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం మల్లాపూర్కు చెందిన బత్తుల పరమేశ్, రెంకల నరేశ్, కొట్టె బానేశ్, జన్నారం మండలం మురిమడుగుకు చెందిన సంపంగి రమేశ్, కలమడుగుకు చెందిన లావుడ్య హరికృష్ణ ఓ ముఠాగా ఏర్పాడి మంచిర్యాల, బెల్లంపెల్లి, జన్నారం, జగిత్యాల జిల్లాల్లో 12 బైక్ లను చోరీ చేశారు. మార్చి 8న జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం పోతారానికి చెందిన కంచర్ల నరేశ్ బైక్ జన్నారంలో చోరీకి గురైంది.
దీంతో అతడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బుధవారం జన్నారంలో వెహికల్స్ చెక్ చేస్తుండగా బత్తుల పరమేశ్, నరేశ్ అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని పట్టుకొని విచారించారు. దీంతో చోరీల విషయం బయటపడింది. వారి సమాచారంతో అశోక్, హరికృష్ణను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.3.60 లక్షల విలువైన 12 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్యాంగ్లోని సంపంగి రమేశ్ పరారీలో ఉండగా బానేశ్ వేరే కేసులో ప్రస్తుతం జైలులో ఉన్నాడు. తక్కువ ధరకు వస్తోందని దొంగ బైక్లను ఎవరూ కొనవద్దని ఏసీపీ సూచించారు.