హైదరాబాద్ వాటర్​బోర్డుకు రూ.3 వేల కోట్లు రావాలె!

హైదరాబాద్ వాటర్​బోర్డుకు రూ.3 వేల కోట్లు రావాలె!
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల నుంచి రూ.1,876 కోట్లు పెండింగ్
  • మిషన్​భగీరథ నుంచి రూ.250 కోట్లు
  • వినియోగదారుల నుంచిరూ.828 కోట్లు  
  • తాజాగా డిమాండ్​నోటీసులు 
  • బిల్లులు చెల్లించాలంటూ లెటర్లు రాసిన ఈడీ

హైదరాబాద్​సిటీ, వెలుగు: నీటి బకాయిలు వాటర్ బోర్డుకు భారంగా మారుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలతోపాటు వినియోగదారుల నుంచి మొత్తంగా రూ.3,086 కోట్లు రావాల్సి ఉంది. దీంతో సంస్థ ఆర్థిక కష్టాల మధ్య నెట్టుకు రావాల్సి వస్తున్నది. బోర్డు ఉన్నతాధికారులు ఇటీవల రెవెన్యూపై నిర్వహించిన సమావేశంలో వేల కోట్ల బకాయిలు చూసి​ విస్తుపోయారు. ఇవి ఏండ్లుగా పేరుకుపోయిన బిల్లులు కావడంతో   చెల్లించకపోయినా ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించినట్టు సమాచారం. 

ఒత్తిడి చేయకపోవడానికి కారణాలు ఏమిటని ప్రశ్నించగా, వినియోగదారులు చెల్లించకపోతే ఏదో ఒక యాక్షన్​ తీసుకుంటామని, ప్రభుత్వ శాఖలు కావడంతో వేచి చూడాల్సి వస్తున్నదని సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో బోర్డు ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​ మయాంక్ మిట్టల్ దీర్ఘకాలికంగా పెండింగ్​లో ఉన్న నీటి బిల్లులపై ఫోకస్​పెట్టారు. ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఇప్పటివరకు ఎక్కువ మొత్తంలో బకాయిలు ఉన్న కనెక్షన్లను గుర్తించి యాక్షన్​ తీసుకునేందుకు నిర్ణయించినట్టు సమాచారం.  

వేల కోట్లు పెండింగ్..  

గ్రేటర్​పరిధిలోని ప్రజలతోపాటు కాకుండా వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసులకు వాటర్​బోర్డు నీటిని సరఫరా చేస్తోంది. నెల నెలా అందరిలాగే ఆఫీసులు బిల్లులు చెల్లించాల్సి ఉంది. అయితే ఏండ్లుగా పెండింగ్ ​పెడుతూ వస్తుండడంతో వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. బోర్డు పరిధిలో13.80 లక్షల కనెక్షన్లు ఉండగా, ఇందులో 75 శాతం డొమెస్టిక్​ కాగా, 10 శాతం ప్రభుత్వ ఆఫీసులవి ఉన్నాయి. మిగిలినవి కమర్షియల్ ​కనెక్షన్లు. 

కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి రూ.236 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల నుంచి రూ.1,640 కోట్లు, డొమెస్టిక్​కనెక్షన్​ దారుల నుంచి రూ.828 కోట్లు, మురికివాడలకు ఉచిత నీటి సరఫరా చేయగా పరిమితికి మించి వినియోగించిన నీటికి రూ.106 కోట్లు, మల్టీస్టోరుడ్ బిల్డింగ్​కనెక్షన్​ దారుల నుంచి రూ.26 కోట్లు బోర్డుకు రావాల్సి ఉంది. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల నుంచే రూ.1,876 కోట్లు రావాల్సి ఉండగా, ప్రైవేట్ ​వ్యక్తుల నుంచి రూ.960 కోట్లు పెండింగ్​లో ఉన్నాయి. 

రూ.110 కోట్లకు మించట్లే

నగరానికి ఆనుకుని ఉన్న జిల్లాలైన భువనగిరి, జనగాం, గజ్వేల్​తదితర ప్రాంతాలకు మిషన్​భగీరథ స్కీం ద్వారానే నీటి సరఫరా చేస్తున్నారు. మిషన్ ​భగీరథకు వాటర్​బోర్డు నీటిని బల్క్​గా సరఫరా చేస్తోంది. ఇందుకుగాను ఇప్పటి వరకూ రూ.250 కోట్లు రావాల్సి ఉంది. నగరంలో వాటర్​ బోర్డు రోజుకు 550 ఎంజీడీల నీటిని సరఫరా చేస్తుండగా, నెలకు రూ. 200 కోట్ల వరకు ఆదాయం రావాలి. కానీ, ప్రస్తుతం రూ.100 నుంచి రూ.110 కోట్లకు మించడం లేదు. 

ఈ నేపథ్యంలో పెండింగ్​బకాయిలపై బోర్డు ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​ మయాంక్ మిట్టల్ స్పెషల్​ఫోకస్ ​పెట్టారు. కనెక్షన్ ​దారులందరికీ డిమాండ్​నోటీసులు జారీ చేశారు. అంతే కాకుండా ఆయా శాఖలకు డైరెక్ట్​గా లెటర్లు రాశారు. నిర్ణయించిన సమయంలోపు బకాయిలను చెల్లించేలా వారిపై ఒత్తిడి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.