కరోనా సోకిందేమోనన్న అనుమానంతో ట్రీట్మెంట్ ఇచ్చేందుకు డాక్టర్లు నిరాకరించారు. దీంతో 3 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. కేరళలో అలువా కడుంగలూర్ ప్రాంతం కంటైన్మెంట్ జోన్ లో ఉంది. ఆ ప్రాంతానికి చెందిన ఓ 3ఏళ్ల బాలుడు కాయిన్ మింగాడు. అప్రమత్తమైన చిన్నారి తల్లిదండ్రులు అత్యవసర చికిత్స కోసం అలువా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు చిన్నారికి ఎక్సరే తీయించాలని తల్లిదండ్రులకు సూచించారు. దీంతో చిన్నారికి ఎక్సరే తీయించగా అందులో బాలుడి శరీరంలో కాయిన్ ఉన్నట్లు గుర్తించారు. కానీ ఆస్పత్రిలో పీడియాట్రిక్ సర్జన్ లేరని, బాలుడికి ట్రీట్మెంట్ ఇచ్చేందుకు నిరాకరించారు. ట్రీట్మెంట్ కోసం ఎర్నాకులం జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లాలంటూ అక్కడి సీనియర్ డాక్టర్ బాధితుడి తల్లిదండ్రులకు చెప్పారు.
ఎర్నాకులం జనరల్ ఆస్పత్రి వైద్యులు టెస్ట్ లు చేసి అత్యవసర చికిత్స కోసం అలప్పుజలోని గవర్నమెంట్ ఆసుపత్రికి పంపారు, అక్కడ బాలుడికి ట్రీట్మెంట్ ఇచ్చేందుకు నిరాకరించిన వైద్యులు చిన్నారికి పండ్లని తినిపించాలని సలహా ఇచ్చారు. కానీ పండ్లని తినిపించేంత స్థోమత లేక చిన్నారిని ఇంటికి తీసుకెళ్లారు అతని తల్లిదండ్రులు. సాయంత్రానికి పరిస్థితి విషమించడంతో మరో సారి గవర్నమెంట్ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా మార్గం మధ్యలో బాలుడు మృతి చెందాడు.
బాలుడి మృతిపై కుటుంబసభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంటైన్మెంట్ జోన్ నుంచి వచ్చామని అందుకే బాలుడికి ట్రీట్మెంట్ ఇచ్చేందుకు డాక్టర్లు నిరాకరించారని మండిపడ్డారు.
అయితే చిన్నారి మరణంపై ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ స్పందించారు. చిన్నారి మరణం చాలా దురదృష్టకరం, సమగ్ర విచారణ తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
