కొల్లాపూర్, వెలుగు: పెంట్లవెల్లి మండలం ఎంగంపల్లి తండా పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచారంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు శుక్రవారం తండా పరిసర ప్రాంతాలను పరిశీలించారు. డీఆర్వో కాశన్న, ఎఫ్ఎస్వో ముజీబ్ ఘోరి పొలాల్లో పాదముద్రలు పరిశీలించి పెద్దపులివేనని నిర్ధారించారు. తండాతో పాటు అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు.
పులి కదలికలను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. అనంతరం సర్పంచ్ గోపి నాయక్ ఆధ్వర్యంలో ఎంగంపల్లి తండాలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాత్రి సమయాల్లో పొలాలకు ఒంటరిగా వెళ్లవద్దని, చిన్న పిల్లలను అటవీ ప్రాంతాలకు పంపవద్దని, గొర్రెలు, పశువుల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పులి కనిపించినా, అనుమానం వచ్చినా వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు.
