ఆదిలాబాద్టౌన్(భీంపూర్), వెలుగు: ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో పులి సంచరిస్తుండడంతో అటవీ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. శనివారం భీంపూర్ మండలం గొల్లఘాట్, తాంసి(కె), పిప్పల్కోటి గ్రామాల సమీపంలోని యల్లా కేశవ్, పాగుల రమేశ్ పత్తి చేలల్లో పులి కనిపించింది. రెండు రోజుల కింద బోథ్ మండలంలోని చింతల్బోరి అటవీ ప్రాంతంలో పులి సంచరించినట్లు అధికారులు గుర్తించారు.
రైతుల సమాచారంతో భీంపూర్ మండలంలో పులి సంచరించిన ప్రాంతాన్ని అటవీ శాఖ అధికారులు పరిశీలించి, ట్రాకింగ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. తిప్పేశ్వర్ అటవీ ప్రాంతం నుంచి ఇక్కడికి పులులు వస్తున్నట్లు తెలుస్తోంది. పశువుల కాపరులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, రాత్రిపూట రైతులు పొలాల్లోకి వెళ్లవద్దని ఫారెస్ట్ ఆఫీసర్లు సూచించారు.
