హైదరాబాద్, వెలుగు: గత ఎడిషన్లో చివరి స్థానంలో నిలిచిన తెలుగు టైటాన్స్ ఈ నెల 7న మొదలయ్యే ప్రొ కబడ్డీ లీగ్ తొమ్మిదో సీజన్లో సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. పలువురు కొత్త ఆటగాళ్లతో బరిలోకి దిగుతున్న తమ జట్టు ఈ సారి సమతూకంతో ఉందని, కచ్చితంగా టైటిల్ నెగ్గుతామని టైటాన్స్ కో ఓనర్ ఎన్. గౌతమ్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త సీజన్లో పోటీ పడే టీమ్ను శనివారం జరిగిన సమావేశంలో పరిచయం చేశారు.
గత సీజన్లో స్టార్ రైడర్ సిద్ధార్థ్ దేశాయ్ ఆరంభంలోనే గాయంతో వైదొలగడం తమ అవకాశాలను దెబ్బతీసిందన్నారు. గత సీజన్ అనుభవంతో ఈ వేలంలో ఎక్స్పీరియన్స్, టాలెంట్ ఉన్న ప్లేయర్లను తీసుకొని జట్టును బలోపేతం చేశామన్నారు. కొత్త కోచ్ వెంకటేశ్ గౌడ్, కెప్టెన్ రవీందర్ పహల్ ఆధ్వర్యంలో ముందుకెళ్తామన్నారు. కాగా, ఈ సీజన్ టైటాన్స్ తమ తొలి మ్యాచ్లో బెంగళూరు బుల్స్తో పోటీ పడనుంది.
