ఒలింపిక్స్ సంబురాన్ని కొనసాగిస్తూ.. పారాఒలింపిక్స్లోనూ ఇండియన్ అథ్లెట్లు సత్తా చాటారు. ఒకే రోజు మూడు పతకాలు సాధించి సరికొత్త హిస్టరీని క్రియేట్ చేశారు. విమెన్ సింగిల్స్ క్లాస్–4 టేబుల్ టెన్నిస్లో భావినాబెన్ పటేల్, మెన్ టీ–47 హైజంప్లో నిషాద్ కుమార్ సిల్వర్ మెడల్స్ గెలవగా, ఆర్మీ మాజీ జవాన్ వినోద్ కుమార్.. మెన్ ఎఫ్–51 సీటెడ్ డిస్కస్ త్రోలో కాంస్యం సాధించి ఇండియా ఆనందాన్ని ట్రిపుల్ చేశాడు. అయితే వినోద్ క్లాసిఫికేషన్పై ప్రత్యర్థి రివ్యూకు వెళ్లడంతో.. అతని రిజల్ట్ను నిర్వాహకులు హోల్డ్లో పెట్టారు. సోమవారం దీనిపై క్లారిటీ రానుంది.
తమ వైకల్యాన్ని మర్చి... ఆత్మవిశ్వాసాన్ని ఆయుధంగా మార్చి.. ఇండియన్ పారా అథ్లెట్లు.. టోక్యో పారాలింపిక్స్లో పతకాల పంట పండించారు..! నేషనల్ స్పోర్ట్స్ డే రోజున మూడు పతకాలు గెలిచి దేశానికి అద్భుతమైన కానుక అందించారు..! టేబుల్ టెన్నిస్లో భావినాబెన్ పటేల్, హైజంప్లో నిషాద్ కుమార్ రజతాలతో మెరిస్తే.. డిస్కస్ త్రోలో వినోద్ కుమార్ కాంస్యం గెలిచాడు..! అయితే అతని క్లాసిఫికేషన్పై ఓ ప్రత్యర్థి రివ్యూకు వెళ్లడంతో వినోద్ రిజల్ట్ను హోల్డ్లో పెట్టారు..!
టోక్యో: పారాలింపిక్స్లో ఇండియా పారా అథ్లెట్ల పెర్ఫామెన్స్ అదిరిపోయింది. ఒకే రోజు మూడు పతకాలు సాధించి.. గతంలో ఎన్నడూ సాధించని కొత్త చరిత్రకు నాంది పలికారు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా పోరాడిన భావినాబెన్ పటేల్.. విమెన్స్ సింగిల్స్ క్లాస్–4 టేబుల్ టెన్నిస్లో సిల్వర్ మెడల్ గెలిచింది. ఫైనల్కు చేరడంతోనే చరిత్ర సృష్టించిన భావినా.. ఆదివారం జరిగిన టైటిల్ పోరులో 7–11, 5–11, 6–11తో వరల్డ్ నంబర్వన్ యింగ్ జిహు (చైనా) చేతిలో ఓడి సెకండ్ ప్లేస్లో నిలిచింది. దీంతో పారాలింపిక్స్ టేబుల్ టెన్నిస్ ఈవెంట్లో మెడల్ సాధించిన తొలి ఇండియన్గా చరిత్ర సృష్టించింది. అంతేకాక దీపా మాలిక్ (షాట్పుట్) తర్వాత పారాలింపిక్స్లో మెడల్ గెలిచిన రెండో ఇండియా మహిళగా భావిన రికార్డులకెక్కింది. 19 నిమిషాల్లో ముగిసిన ఫైనల్లో ఆరుసార్లు వరల్డ్ చాంపియన్ యింగ్ పూర్తి ఆధిపత్యం చూపెట్టింది. గట్టిపోటీ ఇచ్చినా ఫస్ట్ గేమ్ను కోల్పోయిన 12వ ర్యాంకర్ భావిన.. సెకండ్ గేమ్లో తేలిపోయింది. మ్యాచ్ను కాపాడుకునేందుకు భావిన థర్డ్ గేమ్లో నువ్వా నేనా అన్నట్టు తలపడినా... చైనీస్ ప్లేయర్ చాన్స్ ఇవ్వలేదు. సిల్వర్ గెలిచి ఇండియా మెడల్ ఖాతా తెరిచిన భావినాకు.. గుజరాత్ గవర్నమెంట్ రూ. 3 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. అలాగే టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రూ. 31 లక్షలు పురస్కారాన్ని అనౌన్స్ చేసింది.
నిరాశపర్చిన ఆర్చర్లు..
మెడల్ వేటలో ఇండియా ఆర్చర్లు విఫలమయ్యారు. జ్యోతి బలియన్–రాకేశ్ కుమార్ జోడీ కాంపౌండ్ మిక్స్డ్ పెయిర్ ఓపెన్ సెక్షన్ క్వార్టర్ ఫైనల్లోనే తమ పోరాటాన్ని ముగించింది. క్వార్టర్స్లో జ్యోతి–రాకేశ్ 151–153 స్వల్ప తేడాతో టర్కీ జంట ఓనుర్– బులెంట్ చేతిలో పోరాడి ఓడారు. మ్యాచ్ ప్రారంభంలో చేసిన తడబాటు ఈ పోరులో ఇండియా కొంపముంచింది. తొలి సెట్లో 34–37తో ప్రత్యర్థి కంటే మూడు పాయింట్లు తక్కువ స్కోరు చేసింది. రెండో సెట్లో ఇండియా 39–38తో పైచేయి సాధించగా.. తర్వాతి రెండు సెట్లు 39– 39తో సమంగా ముగియడంతో టర్కీకి విజయం సొంతమైంది. అంతకుముందు ప్రిక్వార్టర్స్లో ఇండియా 147–111తో థాయ్లాండ్ జంటను చిత్తు చేసింది. విమెన్స్ కాంపౌండ్ ఓపెన్ సెక్షన్లోనూ ఇండియా పోరు ముగిసింది. ఫస్ట్ రౌండ్ పోరులో జ్యోతి 137–141 తేడాతో లూసీ లెనార్డ్ (ఐర్లాండ్) చేతిలో ఓడింది.
ముగ్గురూ ముగ్గురే
వెలుగు స్పోర్ట్స్ డెస్క్: టోక్యో పారాలింపిక్స్లో మెడల్స్ సాధించిన ముగ్గురు అథ్లెట్లవి వేర్వేరు విషాద గాధలు. వేర్వేరు కారణాలతో అంగవైకల్యానికి గురైన ఈ ముగ్గురు ఒక్క విజయంతో తాము ఎవరికంటే తక్కువ కాదని నిరూపించారు.ఈ క్రమంలో అంగవైకల్యానికి ఎదురీదుతూ వారు చేసిన జీవన ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. గుజరాత్లోని ఓ మారుమూల పల్లెకు చెందిన భావిన... ఏడాది వయసులో పోలియో బారిన పడింది.12 ఏళ్లు వచ్చేసరికి నడుము కింది భాగం పూర్తిగా చచ్చుబడిపోయి వీల్చైర్కు పరిమితమైంది. అలాంటి టైమ్లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సపోర్ట్తో ఆట విడుపుగా టేబుల్ టెన్నిస్ మొదలుపెట్టిన భావిన.. చివరికి పారాలింపిక్స్ పోడియానికి చేరింది. ఇక హైజంప్లో మెడల్ గెలిచిన 21 ఏళ్ల నిషాద్ది మరో కథ. హిమాచల్ ప్రదేశ్కు చెందిన నిషాద్.. తనకు ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడు గ్రాస్ కట్టింగ్ మిషన్ కారణంగా కుడి చేతిని కోల్పోయాడు. హర్యానాకు చెందిన డిస్కస్ త్రోయర్ వినోద్ కుమార్.. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) మాజీ ఉద్యోగి. ట్రెయినింగ్లో భాగంగా 2002లో జరిగిన ప్రమాదంలో లెహ్లోని ఓ కొండ చరియ మీద నుంచి జారిపడ్డాడు. దీంతో వెన్నెముకలో గాయమై రెండు కాళ్లు చచ్చుబడి పోయి పదేళ్ల పాటు మంచానికే పరిమితమయ్యాడు. కాస్త రికవర్ అయ్యాక పారా స్పోర్ట్స్ గురించి తెలుసుకుని అథ్లెట్గా మారాడు.
సిల్వర్ జంప్..
భావిన ఇచ్చిన ఆనందాన్ని ఎంజాయ్ చేసే లోపు హైజంపర్ నిషాద్ కుమార్ దాన్ని డబుల్ చేశాడు. మెన్స్ టీ–47 హైజంప్లో సిల్వర్ మెడల్ గెలిచాడు. ఫైనల్లో అత్యధికంగా 2.06 మీటర్లు ఎత్తు జంప్ చేసిన నిషాద్ ఓవరాల్గా సెకండ్ ప్లేస్లో నిలిచాడు. అంతేకాక ఏషియన్ రికార్డును కూడా బద్దలుకొట్టాడు. 2.15 మీటర్లు జంప్ చేసి వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన టౌన్సెండ్ (అమెరికా) గోల్డ్ దక్కించుకున్నాడు. 2.06 మీటర్లే దూకిన వైస్ (అమెరికా) కూడా రెండో ప్లేస్లో నిలిచి సిల్వర్ అందుకున్నాడు. ఇదే ఈవెంట్లో పోటీ పడిన మరో ఇండియన్ అథ్లెట్ రాంపాల్ అత్యధికంగా1.94 మీటర్లు జంప్ చేసి ఐదో ప్లేస్తో పోటీని ముగించాడు.
వినోద్ సూపర్ త్రో...
మెన్స్ ఎఫ్–51 సీటెడ్ డిస్కస్ త్రోలో వినోద్ కుమార్ ఇండియాకు కాంస్య పతకం అందించాడు. ఫైనల్లో వినోద్ డిస్క్ను అత్యధికంగా 19.91 మీటర్లు త్రో చేశాడు. దీంతో ఏషియన్ రికార్డును తిరగరాయడమే కాకుండా ఓవరాల్ టేబుల్లో మూడో ప్లేస్లో నిలిచి బ్రాంజ్ మెడల్ను సాధించాడు. దీంతో డిస్కస్ త్రోలో 37 ఏళ్ల తర్వాత ఇండియాకు పతకం రావడం విశేషం. 20.02 మీటర్లతో కోసివిచ్ (పోలాండ్), 19.98 మీటర్ల త్రో తో సాండర్ (క్రొయేషియా) వరుసగా గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించారు.