అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో, చివరి దశ పోలింగ్కు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. 14 జిల్లాల పరిధిలోని 93 అసెంబ్లీ సీట్ల లో సోమవారం పోలింగ్ జరగనుంది. 833 మంది బరిలో ఉండగా.. 2.51 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రెండో దశలో బీజేపీ, కాంగ్రెస్, ఆప్ పోటాపోటీగా ప్రచారం చేశాయి. శనివారంతో ఎన్నికల ప్రచారం పూర్తయ్యింది. ఈ నెల 8న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.
మూడు పార్టీల మధ్యే పోరు
గుజరాత్అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య 182. డిసెంబర్ 1న జరిగిన తొలి దశ ఎన్నికల్లో సౌరాష్ట్ర, కుచ్, సౌత్ గుజరాత్ రీజియన్లలోని 89 సీట్లకు పోలింగ్ పూర్తయ్యింది. 63.31 శాతం పోలింగ్ రికార్డయ్యింది. ఇక మిగిలిన 93 సీట్లకు సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. కీలకమైన అహ్మదాబాద్, వడోదర, గాంధీనగర్తదితర జిల్లాల్లో పోలింగ్ జరగనుంది. బీజేపీ, కాంగ్రెస్, ఆప్ సహా 61 పార్టీల నుంచి 833 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో 285 మంది ఇండిపెండెంట్లు. బీజేపీ, ఆప్ మొత్తం 93 సీట్లలో పోటీపడుతుంటే.. కాంగ్రెస్ 90 చోట్ల పోటీ చేస్తోంది. కాంగ్రెస్ మిత్రపక్షం ఎన్సీపీ రెండు సీట్లలో పోటీ పడుతోంది. బీఎస్పీ 44 సీట్లలో, భారతీయ ట్రైబరల్ పార్టీ 12 చోట్ల పోటీ చేస్తున్నాయి.
పోటాపోటీ ప్రచారం..
రెండో దశలో కీలక నియోజకవర్గాల విషయానికి వస్తే గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్.. ఘట్లోడియా నుంచి పోటీ చేస్తున్నారు. పాటిదార్ లీడర్ హార్దిక్ పటేల్ విరాంగమ్ నుంచి, గాంధీనగర్ సౌత్ నుంచి అల్పేష్ ఠాకూర్ బీజేపీ టికెట్పై బరిలో నిలిచారు. దళిత్ లీడర్ జిగ్నేశ్ మేవానీ కాంగ్రెస్ టికెట్పై వాద్గామ్ నుంచి పోటీ చేస్తున్నారు. గుజరాత్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సుఖ్రామ్ రాత్వా జెత్ పూర్ నుంచి బరిలో దిగారు. బీజేపీ తరఫున ప్రధాని మోడీ సుడిగాలి ప్రచారం చేశారు. ఈ నెల 1, 2 తేదీల్లో అహ్మదాబాద్లో వరుస రోడ్షోల్లో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ కూడా ప్రచారం చేశారు. ఆప్ తరఫున పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ప్రచారంలో పాల్గొన్నారు.
14,975 పోలింగ్ స్టేషన్లు
రెండో దశలో 2.51 కోట్ల మంది ఓటు వేయనున్నారు. ఇందులో 1.29 కోట్ల మంది మగాళ్లు కాగా, 1.22 కోట్ల మంది మహిళలు. మొత్తం 14,975 పోలింగ్ స్టేషన్లను ఈసీ ఏర్పాటు చేసింది. 1.13 లక్షల మంది ఎన్నికల సిబ్బంది బాధ్యతలు నిర్వహించనున్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 93 సీట్లలో బీజేపీ 51 చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్ 39 సీట్లు దక్కించుకుంది. మూడు చోట్ల ఇండిపెండెంట్లు గెలిచారు. అప్పట్లో సెంట్రల్ గుజరాత్లో సత్తా చాటిన బీజేపీ 37 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 22 సీట్లకే పరిమితమైంది. కానీ, నార్త్ గుజరాత్లో మాత్రం కాంగ్రెస్ హవా కనిపించింది. హస్తం పార్టీకి ఇక్కడ 17 సీట్లు వస్తే.. బీజేపీ 14 సీట్లకే పరిమితమైంది.
అహ్మదాబాద్లో ఓటేయనున్న మోడీ, అమిత్షా
ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా అహ్మదాబాద్లో ఓటు వేయనున్నారు. మోడీ ఆదివారం సాయంత్రమే అహ్మదాబాద్ చేరుకున్నారు. నేరుగా తల్లి హీరాబెన్ ఇంటికి వెళ్లి ఆమె ఆశీస్సులు తీసుకున్నారు. రానిప్ ఏరియాలోని ఓ హైస్కూల్లోని పోలింగ్ స్టేషన్లో మోడీ ఓటు వేస్తారని అధికారులు వెల్లడించారు. నారాన్పురా ఏరియాలోని మున్సిపల్ సబ్ జోనల్ ఆఫీస్ అమిత్షా ఓటు వేయనున్నారు.