
తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ హీరో చంద్రమోహన్ మరణ వార్తతో ఇండస్ట్రీ అంత శోకంలో ఉండగానే..మరోక తెలుగు నిర్మాత చనిపోయారు.
ప్రముఖ సినీ నిర్మాత యక్కిలి రవీంద్రబాబు (55)(Yakkali Ravindra Babu) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ..హైదరాబాద్లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ..ఇవాళ (నవంబర్ 11) మధ్యాహ్నం తుది శ్వాస విడిచినట్లు సమాచారం. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
శ్రావ్య ఫిలిమ్స్ వ్యవస్థాపక నిర్మాతలలో ఒకరైన రవీంద్ర బాబు..ఎన్నో సూపర్ హిట్ మూవీస్ను తెరకెక్కించాడు. ఆయన నిర్మాతగా మిత్రులతో కలిసి..సొంత ఊరు, గంగపుత్రులు లాంటి అవార్డు మూవీస్తో సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా గుర్తింపు పొందారు.
మా నాన్న నక్సలైట్, ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, రొమాంటిక్ క్రిమినల్స్, గల్ఫ్, వలస లాంటి విభిన్నమైన చిత్రాలు నిర్మించి మంచి అభిరుచి గల నిర్మాతగా టాలీవుడ్ లో పేరు పొందారు.
రవీంద్రబాబు ప్రొడ్యూసర్ గానే కాకుండా..లిరిక్ రైటర్ గాను పనిచేశారు. హనీ ట్రాప్, సంస్కార కాలనీ,మా నాన్న నక్సలైట్ వంటి మూవీస్ కు లిరిక్స్ రాసారు. ఈయన తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళం బాషల్లో దాదాపు 17 సినిమాలు నిర్మించారు. రవీంద్రబాబుకు భార్య రమాదేశి, కుతూరు ఆశ్రీత, కుమారుడు సాయి ప్రభాస్ లు ఉన్నారు.