
- ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్లో మంత్రి జూపల్లి కృష్ణారావు
హైదరాబాద్, వెలుగు : పర్యాటకంలో పెట్టుబడులే లక్ష్యంగా త్వరలోనే తెలంగాణలో అత్యున్నత స్థాయి టూరిజం కాన్క్లేవ్ నిర్వహించనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. హైదరాబాద్లో శుక్రవారం (సెప్టెంబర్ 19) ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్ (టీటీఎఫ్)ను మంత్రి టూరిజం ఎండీ వల్లూరు క్రాంతితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రెడీ చేశామన్నారు. పర్యాటకం కేవలం వినోదమే కాకుండా ఉపాధి, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహదం చేస్తోందన్నారు.
కొత్త టూరిజం పాలసీ పెట్టుబడులకు అనుకూలమని, వివిధ వినూత్న ఆలోచనలు, ప్రాజెక్టులతో యువ పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని, వారికి పూర్తిగా మద్దతు ఇస్తామని చెప్పారు. పర్యాటక అవకాశాలను ప్యాకేజ్ చేయడంలో టూరిజం, ట్రావెల్స్, హస్సిటాలిటీ ఎగ్జిబిటర్లు, ప్రతినిధులు తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవాలని మంత్రి పిలుపునిచ్చారు.