
కరువొస్తే వాడుకోడానికే కాదు, కనీసం తాగడానికీ నీళ్లుండని పరిస్థితి వస్తుంది. ఇలానే గతంలో మహారాష్ట్రలోని లాతూర్లో తీవ్రమైన కరువొస్తే రైళ్లలో తాగునీటిని పంపించాల్సి వచ్చింది. ఇలాంటి కరువే 2017లో సౌతాఫ్రికాలోనూ వచ్చింది. రాజధాని కేప్టౌన్లో తాగడానికి నీళ్లు లేక జనం అల్లాడిపోయారు. ఇప్పటికీ అక్కడ రోజుకు 70 లీటర్ల కన్నా ఎక్కువ ఇవ్వట్లేదు. అందుకే మల్లోసారి కరువొస్తే తాగడానికైనా ఇబ్బంది లేకుండా ఓ సౌతాఫ్రికన్ మంచి ఐడియా వేశాడు. విరిగి పోయిన షిప్పులను రికవరీ చేసే పని చేసే స్లోవానే.. అంటార్కిటికా నుంచి ఓ పేద్ద ఐస్గడ్డను తీసుకొస్తానంటున్నాడు. ఎట్ల తీసుకొస్తడు? తీసుకొచ్చినా ఏం చేస్తడు? అని డౌటొద్దు. ఆ ప్రాసెస్ను పూసగుచ్చినట్టు చెప్పాడు. ఒక కిలోమీటరు పొడవు, అర కిలోమీటరు వెడల్పు, పావు కిలోమీటరు ఎత్తుతో 12 కోట్ల టన్నుల బరువుండే ఓ పెద్ద మంచుగడ్డను తీసుకొస్తే ఆర్థికంగా గిట్టుబాటవుతుందంటున్నాడు. ఇంత పెద్ద ఐస్గడ్డతో ఏడాది పాటు 20 శాతం కేప్టౌన్ నగర ప్రజలకు తాగు నీరు అందించొచ్చని వివరించాడు.
రూ.1,300 కోట్ల ఖర్చు
తన ‘సౌత్రన్ ఐస్ ప్రాజెక్టు’కు ప్రాజెక్టు కోసం ఇప్పటికే జియాలజిస్టులు, ఓషనోగ్రఫర్లు, ఇంజినీర్లను సంప్రదించాడు. మొత్తం ప్రాజెక్టుకు రూ.1,300 కోట్లవుతుందని అంచనా వేస్తున్నాడు. ఈ ఆర్థిక సాయమందించేందుకు రెండు సౌతాఫ్రికా బ్యాంకులు, స్విస్ వాటర్ టెక్ కంపెనీ వాటర్ విజన్ ఏజీలు ముందుకొచ్చాయి. ఆరు నెలల్లో ప్రాజెక్టుకు కావాల్సినవన్నీ సిద్ధం చేస్తానని చెబుతున్నాడు స్లొవానే. అంటార్కిటికాలో ఏటా లక్ష వరకు పెద్ద పెద్ద మంచుగడ్డలు కరిగి మంచి నీరు సముద్రం పాలవుతుంటుంది. ఇలా మంచు గడ్డలను తీసుకురావడం కొత్తేం కాదు. 1800ల్లో చైనాకు చెందిన బెవరేజ్ కంపెనీలు చిన్న చిన్నవి తీసుకొచ్చేవట. నీళ్ల స్టోరేజ్ కోసం ఎక్కువగా వాటిని వాడుకునేవట. మంచుగడ్డను తీసుకురావడానికి గతంలో యూఏఈ కూడా ప్లాన్ చేసింది.