
హైదరాబాద్, వెలుగు: టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం) కర్ణాటకలో ప్లాంటు ఏర్పాటు చేయడానికి అక్కడి ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసుకుంది. ఇందుకోసం దాదాపు రూ.3,300 కోట్ల పెట్టుబడి పెడుతుంది. ఇది కంపెనీకి భారతదేశంలో మూడవ ప్లాంట్. బెంగళూరు సమీపంలోని బిడాడిలో దీనిని నిర్మిస్తారు.
కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, టయోటా కిర్లోస్కర్ మోటార్ మేనేజింగ్ డైరెక్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మసకాజు యోషిమురా, భారీ, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి ఎం. బి. పాటిల్ సమక్షంలో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసి మార్పిడి చేసుకున్నారు. ప్లాంటు ఏర్పాటు వల్ల రెండు వేల ఉద్యోగాలు వస్తాయని, తమ ప్రొడక్షన్ కెపాసిటీ లక్ష యూనిట్లు పెరుగుతుందని కంపెనీ తెలిపింది.