
- సీపీఐ కౌన్సిల్ మెంబర్ను అడ్డుకున్న టీఆర్ఎస్ నాయకులు
- ఘర్షణలో తలలు పగలగొట్టుకున్న ఇరు పార్టీల లీడర్లు
- ఖమ్మం రూరల్ మండలంలో ఘటన
ఖమ్మం రూరల్, వెలుగు : పాలేరు నియోజవకర్గం ఖమ్మం రూరల్ మండలంలోని కామంచికల్లులో శుక్రవారం టీఆర్ఎస్, సీపీఐ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రెండు పార్టీల కార్యకర్తలు కొట్టుకోవడంతో పలువురికి తలలు పలిగాయి. గురువారం రాత్రి పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి సమక్షంలో సీపీఐకి చెందిన సర్పంచ్ మేదరమెట్ల వెంకటరమణ, వార్డు మెంబర్లు, పలు సీపీఐ కుటుంబాలు టీఆర్ఎస్ లో చేరాయి. ఈ నేపథ్యంలోనే గ్రామంలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. శుక్రవారం జానబాద్తండాకు చెందిన సీపీఐ నాయకుడు మరణించగా సీపీఐ కౌన్సిల్ సభ్యులు పుచ్చకాయల కమలాకర్ గ్రామానికి వెళ్లి నివాళులర్పించి తిరుగు ప్రయాణమయ్యారు. కామంచికల్లుకు చేరుకునే క్రమంలో టీఆర్ఎస్ నాయకులు కమలాకర్ వెళ్తున్న కారును అడ్డగించారు.
‘కామంచికల్లులో నీకేం పని. మా గ్రామంలో నీ పెత్తనమేంది?’ అని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఘర్షణ చోటు చేసుకుంది. అప్పటికే అక్కడకు చేరుకున్న సీపీఐ నాయకులు టీఆర్ఎస్ లీడర్లతో వాదనకు దిగారు. కొద్దిసేపటి తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయిన కమలాకర్ గుడూరుపాడుకు చెందిన పార్టీ నాయకులకు విషయం చెప్పాడు. దీంతో సీపీఐ నాయకులు పెద్ద సంఖ్యలో గూడూరుపాడు నుంచి కామంచికల్లు సెంటర్కు చేరుకున్నారు. అక్కడే ఉన్న టీఆర్ఎస్ నాయకులతో గొడవ పడ్డారు. ఈ క్రమంలో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో టీఆర్ఎస్కు చెందిన ఇద్దరికి, సీపీఐకి చెందిన ఐదుగురి తలలు పగిలాయి. ఇరువర్గాల నాయకులు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.