హైదరాబాద్: రాష్ట్రంలో నిరుద్యోగులు ఉండటానికి కాంగ్రెస్, టీడీపీలే కారణమని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరుద్యోగులు తమకు ఓటేశారన్నారు. హుజురాబాద్లో టీఆర్ఎస్ గెలిచిన తర్వాత బీజేపీ, కాంగ్రెస్ పార్టీల చీఫ్లు ఎర్రగడ్డ హాస్పిటల్లో చేరాల్సిందేనన్నారు. టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధి చూసి ప్రతిపక్షాలు అసూయగా ఫీల్ అవుతున్నాయని చెప్పారు. ఎప్పటికైనా మంత్రి కేటీఆర్ దేశానికి ప్రధాని కావడం ఖాయమన్నారు.
‘అందరూ చూస్తూనే ఉండండి. వచ్చే 20, 30 ఏళ్లలో కేటీఆర్ ప్రధాని అవుతారు.. తెలంగాణలో నిరుద్యోగులు ఉండటానికి కాంగ్రెస్, టీడీపీలే కారణం. ఆ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి వుంటే ఇప్పుడు నిరుద్యోగులు ఉండేవాళ్లే కాదు. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరుద్యోగులు మాకు ఓటు వేయలేదా? మీకు ఎందుకు ఓటు వేయలేదు? హుజురాబాద్లో టీఆర్ఎస్ గెలిచాక బీజేపీ కాంగ్రెస్ అధ్యక్షులు ఎర్రగడ్డ హాస్పిటల్లో చేరాల్సిందే. ఎమ్మెల్యే రఘునందన్ కూడా పెద్దగా చదివినట్లు కనిపిస్తలేదు. డేటా లేకుండా మాట్లాడుతున్నారు’ అని జీవన్ రెడ్డి దుయ్యబట్టారు.