
హైదరాబాద్, వెలుగు: ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఎప్సెట్ (ఎంసెట్) అప్లికేషన్లు ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్నాయి. మంగళవారం హైదరాబాద్లోని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్లో ఎప్సెట్ కమిటీ మొదటి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జేఎన్టీయూ వీసీ కట్టా నర్సింహారెడ్డి, సెట్ కన్వీనర్ దీన్ కుమార్ తో కలిసి కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి ఎప్ సెట్ షెడ్యూల్ ను రిలీజ్ చేశారు. ఈ నెల 21న నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్టు చెప్పారు.
26 నుంచి ఏప్రిల్ 6 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఎప్ సెట్ పరీక్షకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ సబ్జెక్టుల్లోని వందశాతం సిలబస్ ఉంటుందని చెప్పారు. మే 9 నుంచి 12 వరకు ఎప్ సెట్ పరీక్షలుంటాయని గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, ఎప్ సెట్ పూర్తిస్థాయి కమిటీని ఈ సందర్భంగా నియమించారు. ఎప్ సెట్ కో కన్వీనర్గా ప్రొఫెసర్ విజయకుమార్ రెడ్డి, కో ఆర్డినేటర్లుగా ప్రొఫెసర్ తారా కల్యాణి, డి.దర్గకుమార్ నియమితులయ్యారు.
మార్చి16 నుంచి పీజీఈసెట్ అప్లికేషన్లు..
వచ్చేనెల16 నుంచి పీజీఈసెట్ దరఖాస్తులు స్వీకరించనున్నట్టు అధికారులు ప్రకటించారు. మంగళవారం కౌన్సిల్లో పీజీఈసెట్ కమిటీ సమావేశం జరిగింది. పీజీఈసెట్ షెడ్యూల్ను కౌన్సిల్ చైర్మన్ లింబాద్రి, జేఎన్టీయూ వీసీ కట్టా నర్సింహారెడ్డి, పీజీఈసెట్ కన్వీనర్ అరుణకుమారి తదితరులు రిలీజ్ చేశారు. మార్చి16 నుంచి మే 10 వరకు ఫైన్ లేకుండా అప్లై చేసుకోవచ్చని వారు సూచించారు.
ALSO READ: వీవీపీ స్టాఫ్ నర్సులకు జోనల్ అలకేషన్ ఉత్తర్వులు