హైదరాబాద్, వెలుగు: తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులకు 317 జీవో ప్రకారం ఇచ్చిన జోనల్ అలకేషన్ ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని కమిషనర్, డాక్టర్ అజయ్కుమార్ మంగళవారం సర్క్యులర్ జారీ చేశారు. అలాట్ అయిన జోన్లలో 8వ తేదీ లోపు రిపోర్ట్ చేయాలని నర్సులకు సూచించారు. జోనల్ అలాట్మెంట్కు సంబంధించిన అప్పీళ్లు, స్పౌజ్ కేసులకు సంబంధించిన దరఖాస్తులు ఈ నెల 8వ తేదీలోగా ఇవ్వాలని కమిషనర్ స్పష్టం చేశారు.
నర్సుల నుంచి వచ్చిన అప్పీళ్ల దరఖాస్తులను 9వ తేదీన తనకు అందజేయాలని అధికారులను ఆదేశించారు. వాస్తవానికి, 317 జీవో ప్రకారం నర్సులకు జోన్ల అలాట్ చేస్తూ జనవరి 16వ తేదీనే ఉత్తర్వులు ఇచ్చారు. కానీ, నర్సులు ఆందోళన చేయడంతో ఆ ఉత్తర్వుల అమలును తాత్కాలికంగా నిలిపివేస్తూ జనవరి 19న ఆదేశాలిచ్చారు. ఇటీవల భారీ సంఖ్యలో నర్సింగ్ రిక్రూట్మెంట్ జరిగింది. కొత్త వాళ్లకు పోస్టింగ్స్ ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ముందే జోనల్ అలకేషన్లు పూర్తి చేసి, ఆ తర్వాత కొత్త వాళ్లకు పోస్టింగ్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ALSO READ: ఐటీఐలో 6 కొత్త ట్రేడ్లు, 23 షార్ట్ టర్మ్ కోర్సులు