ధరణి పోర్టల్ను ఆసరాగా చేసుకొని గత బీఆర్ఎస్ పాలనతో పక్కా స్కెచ్తో ప్రభుత్వ భూములను అక్రమార్కులు కొల్లగొట్టారు. ఒకవైపు రైతుల పట్టా భూములను ప్రభుత్వ భూములుగా నమోదు చేసి.. ఇంకోవైపు ప్రభుత్వ భూములను పట్టా ల్యాండ్స్గా రికార్డ్ చేశారు. దీంతో సర్కార్ భూముల్లో ఎంతవరకు పట్టా భూములుగా మారాయో లెక్క తెలియకుండా పోర్టల్లో గోల్మాల్ చేశారు. ఈ భూ దందాను ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది.
ధరణి సమస్యల పరిష్కారానికి, అందులోని తప్పులను తేల్చేందుకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఇతర శాఖల ఉన్నతాధికారులతో కమిటీ సమావేశాలు నిర్వహించింది. ఈ సందర్భంగా అసలు ధరణి పోర్టల్లో ఏ భూములు ఎంత చూపిస్తున్నాయి ? వాస్తవంగా ఎంత భూమి ఉండాలి ? గత ప్రభుత్వం ఏయే భూములను ప్రభుత్వ అవసరాలకు సేకరించింది? అందులో అటవీ, దేవాదాయ, వక్ఫ్ ల్యాండ్స్తో పాటు ఇతర ప్రభుత్వ భూములు ఏమున్నాయి?... అనే వివరాలను కమిటీ సరిపోల్చింది. ధరణిలో నమోదైన భూములకు.. రికార్డుల్లో ఉన్నవాటికి తేడాలు గమనించింది.
రికార్డులతో పోలిస్తే ధరణి పోర్టల్లో దేవాదాయ, వక్ఫ్ ల్యాండ్స్ 40 శాతం తక్కువగా చూపిస్తున్నది. అదే ఫారెస్ట్ ల్యాండ్స్ 6 లక్షల ఎకరాలు తక్కువగా చూపిస్తున్నది. ఇంకా ఇతర ప్రభుత్వ భూములపై స్పష్టత లేదు. ఇదే విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి కూడా వెళ్లింది. దీంతో అసలు ప్రభుత్వ భూములపై పూర్తి లెక్కలు తీయాలని రాష్ట్ర సర్కార్ డిసైడ్ అయింది. మండలాలు, జిల్లాల వారీగా ఏయే గ్రామంలో అటవీ, దేవాదాయ, వక్ఫ్, ఇతర ప్రభుత్వ భూములు 2014 కంటే ముందు(తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కంటే ముందు) ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి ? ఇప్పుడు ఎంత ఉన్నాయి ? ధరణి వచ్చాక ఎంత విస్తీర్ణంలో మార్పులు వచ్చాయి ? ఏయే సంవత్సరంలో ఎలా మారాయి ? ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఎంత అమ్మారు ? ఇతర అవసరాలకు ఏ మేరకు మారాయి?.. అనేవి వివరాలను పూర్తిస్థాయిలో సేకరించే పనిలో పడింది. ఫలితంగా ఎవరు.. ఎక్కడ ఏ ప్రభుత్వ భూమిని పట్టాగా మార్చుకున్నారో తేలిపోనుంది.