
హైదరాబాద్, వెలుగు: టీఎస్పీఎస్సీ మెంబర్ అరుణ కుమారి తన పదవికి రాజీనామా చేశారు. శనివారం ఆమె గవర్నర్ తమిళిసైకి రిజిగ్నేషన్ లెటర్ పంపిం చారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ సర్కారు.. 2021, మే 21న ఐఏఎస్ ఆఫీసర్ జనార్దన్ రెడ్డి టీఎస్పీఎస్సీ చైర్మన్ గా, కారం రవీందర్ రెడ్డి, బండి లింగారెడ్డి, ఆర్.సత్యనారాయణ, సుమిత్రానంద్, అరుణకుమారిని సభ్యులుగా నియమించిన విషయం తెలిసిందే. వీరిలో అరుణకుమారి మినహా మిగిలిన వారంతా దశలవారీగా రాజీనామా చేశారు.
జనార్దన్ రెడ్డి సహా మరో ము గ్గురు సభ్యుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించారు. ఇటీవలే రాజీనామా చేసిన సుమిత్రానంద్ రాజీనామాకు ఇంకా ఆమోదం తెలుపలేదు. తాజాగా అరుణ కుమారి కూడా రిజైన్ చేయడంతో పాత టీమ్ మొత్తం రిజైన్ చేసినట్టు అయింది. కాగా, రెండ్రోజుల క్రితమే టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ గా మహేందర్ రెడ్డి, సభ్యులుగా అనితా రాజేంద్ర, ప్రొఫెసర్ యాదయ్య, అమీర్ ఉల్లాఖాన్, వై రాంమోహన్ రావు, పాల్వాయి రజనికుమారిని సర్కారు నియమించిన విషయం తెలిసిందే.
ఆ ఇద్దరు సభ్యుల బాధ్యతల స్వీకరణకుమరికొంత టైమ్..
టీఎస్పీఎస్సీ కొత్త సభ్యులుగా ఎంపికైన రాంమో హన్ రావు, అమీర్ ఉల్లాఖాన్ బాధ్యతలు చేపట్టేందుకు కొంత టైమ్ తీసుకోనున్నట్టు తెలుస్తోంది. రాంమోహన్ రావు ప్రస్తుతం టీఎస్ జెన్కోలో ఈడీగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఆయన సర్వీస్ మరో రెండు, మూడు నెలలున్నట్టు సమాచారం. అయితే, జెన్కోలో ఆయన జీతం రూ.6 లక్షలకు పైగా ఉండగా, కమిషన్లో చేరితే జీతం తగ్గే అవకాశం ఉంది. దీంతో ఆయన నెల, రెండు నెలల పాటు సర్కారు నుంచి మినహాయింపు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. అయితే, త్వరలోనే కమిషన్ బాధ్యతల్లో చేరుతారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. మరో మెంబర్ అమీర్ ఉల్లాఖాన్ విదేశాల్లో ఉండటంతో, వచ్చేనెల 5న ఆయన కమిషన్ బాధ్యతల్లో చేరే అవకాశాలున్నాయని అధికారిక వర్గాలు చెప్తున్నాయి.