జీవో నంబర్ 49ను రద్దు చేయాలి : తుడుం దెబ్బ నాయకులు

జీవో నంబర్ 49ను రద్దు చేయాలి : తుడుం దెబ్బ నాయకులు

నస్పూర్/తిర్యాణి, వెలుగు: టైగర్ ​జోన్​ ఏర్పాటు కోసం తీసుకొచ్చిన జీవో నంబర్ 49ని రద్దు చేయాలని తుడుం దెబ్బ నాయకులు డిమాండ్​చేశారు. శుక్రవారం నస్పూర్ ప్రెస్ క్లబ్​లో మీడియాతో మాట్లాడుతూ.. జీవో నంబర్ 49ను రద్దు చేయాలని కోరుతూ.. ఈ నెల 6 నుంచి13వరకు ఉమ్మడి జిల్లాలోని ప్రతి గ్రామంలో సమావేశాలు నిర్వహిస్తామని, 14న ప్రతి మండల కేంద్రంలోని తహసీల్దార్ ఆఫీస్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసుల వద్ద ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. 

వన మహోత్సవం పేరుతో ఆదివాసీల పోడు భూములలో ఫారెస్ట్ అధికారులు లాక్కొని ఫెన్సింగ్ వేడాన్ని ఆపాలని డిమాండ్​ చేశారు. ఆదివాసులపై పెట్టిన ఆక్రమ కేసులను కొట్టివేయాలన్నారు. తుడుం దెబ్బ నాయకులు రాజు, చిలుకయ్య, ఆత్రం మహేశ్,  సోయం జంగు, కుడిమెత తిరుపతి, రాజరామ్, భీమన్న తదితరులు పాల్గొన్నారు. 

టైగర్ జోన్​కు వ్యతిరేకంగా నిరసన

జీవో నెంబర్  49ను రద్దు చేయాలని ఆదివాసీ సంఘాలు డిమాండ్​చేశాయి. శుక్రవారం తిర్యాణిలో ఆదివాసీ సంఘాల నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్​లో తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షుడు  భగవంత్ రావు మాట్లాడుతూ.. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా టైగర్ కారిడార్‌గా మారుస్తామంటే ఊరుకోబోమన్నారు. 

టైగర్​ జోన్​ఏర్పాటైతే ఆదివాసీ గ్రామాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపారు. జీవో 49 తక్షణమే ఉపసంహరించకోవాలని డిమాండ్​చేశారు. ఆదివాసీ సంఘాల నాయకులు మడావి శ్రీరాములు, గెడం సుభాశ్, పెందోర్ ధర్ము, అచ్యుత్ రావు, భాస్కర్  తదిత రులు ఉన్నారు.