ఢిల్లీ హైకోర్టుకు ట్విట్టర్ విజ్ఞప్తి
న్యూఢిల్లీ: కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన ఐటీ రూల్స్ ఫాలో అవ్వడానికి తమకు మరింత సమయం ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టును ట్విట్టర్ కోరింది. గ్రీవియెన్స్ ఆఫీసర్ను నియమించడంతోపాటు ఐటీ రూల్స్ను అనుసరించేందుకు తమకు 8 వారాల గడువు ఇవ్వాలని ట్విట్టర్ విజ్ఞప్తి చేసింది. భారత్లో సంస్థ కార్యకలాపాలను ప్రధాన కార్యాలయంతో అనుసంధానించడం కోసం ఇక్కడ ఆఫీస్ను నెలకొల్పనున్నట్లు స్పష్టం చేసింది. ఈ ఆఫీస్ కంపెనీకి పర్మినెంట్ కాంటాక్ట్ అడ్రస్గా ఉంటుందని పేర్కొంది.
కొత్త ఐటీ రూల్స్ను పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని గత వారం ట్విట్టర్కు ఢిల్లీ హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. చట్టం ప్రకారం వెంటనే గ్రీవియెన్స్ ఆఫీసర్ను నియమించాలని ఆదేశించింది. అయితే కోర్టు నిర్దేశించిన గడువు గురువారంతో ముగియనుండటంతో ఈ నెల 11వ తేదీ వరకు కంపైలెన్స్ రిపోర్టును అందజేస్తామని కోర్టుకు ట్విట్టర్ తెలిపింది. ఇప్పటికే చీఫ్ కంపైలెన్స్ ఆఫీసర్ను నియమించామని, త్వరలో మరో ఇద్దరు ఎగ్జిక్యూటివ్లను కూడా అపాయింట్ చేస్తామని పేర్కొంది.