
- ఎత్తుకెళ్లిన క్యాష్ క్యాసెట్, రెండు బైకులు, గ్యాస్ కట్టర్ స్వాధీనం
- పరారీలో మరో ముగ్గురు
బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి పట్టణంలోని ఎస్బీఐ ఏటీఎంను పగులగొట్టి చోరీకి యత్నించిన ఐదుగురిలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం ఏసీపీ రవికుమార్తో కలిసి డీసీపీ ఎగ్గడి భాస్కర్ వివరాలు వెల్లడించారు. హర్యానాకు చెందిన మహమ్మద్ ముస్తఫా, షాహిద్, అలీమ్ ఖాన్, సాజిద్, అఫ్తాబ్ కొంతకాలంగా ఇక్కడ జేసీబీ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు. జల్సాలకు అలవాటుపడ్డ వీరు వచ్చే జీతం సరిపోకపోవడంతో ఏటీఎం చోరీ చేయాలని ప్లాన్వేశారు.
సోమవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో కాల్టెక్స్ ఏరియాలోని ఎస్బీఐ ఏటీఎం వద్దకు చేరుకున్నారు. గ్యాస్ కట్టర్ సహాయంతో ఏటీఎం క్యాష్ యూనిట్ను ధ్వంసం చేయడంతో సైరన్ మోగింది. భయపడిపోయిన వారు క్యాష్క్యాసెట్తో పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు, నాలుగు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టి మహమ్మద్ ముస్తఫా, షాహిద్ ను పట్టుకున్నారు.
వారి వద్ద నుంచి క్యాష్ క్యాసెట్, రెండు బైక్లు, గ్యాస్ కట్టర్, చోరీకి ఉపయోగించిన ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులను పట్టుకున్నామని, మిగతా ముగ్గురు పరారీలో ఉన్నారని తెలిపారు. కేసును ఛేదించిన రూరల్ సీఐ అఫ్జలుద్దీన్, ఎస్సైలు మహేందర్, ప్రసాద్, సిబ్బందిని ఏసీపీ అభినందించారు.