ఇకపై ఏటా రెండుసార్లు బోర్డు ఎగ్జామ్స్.. కొత్త కరిక్యులమ్ రూపొందించిన కేంద్ర విద్యాశాఖ 

ఇకపై ఏటా రెండుసార్లు బోర్డు ఎగ్జామ్స్.. కొత్త కరిక్యులమ్ రూపొందించిన కేంద్ర విద్యాశాఖ 

న్యూఢిల్లీ: విద్యావిధానంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేస్తోంది. కొత్త ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ ఈపీ)కి అనుగుణంగా న్యూ కరిక్యులమ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్ సీఎఫ్)ను రూపొందించింది. ఇస్రో మాజీ చీఫ్ కె.కస్తూరిరంగన్ నేతృత్వంలో కేంద్ర విద్యాశాఖ ఏర్పాటు చేసిన నేషనల్ స్టీరింగ్ కమిటీ ఎన్ సీఎఫ్ ను తయారు చేసింది. దీని ప్రకారం.. 

  • ఇకపై ఏడాదికి రెండుసార్లు బోర్డు ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. విద్యార్థులు తమకు ఆయా సబ్జెక్టుల్లో వచ్చిన బెస్ట్ స్కోర్ ను ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఇది స్టూడెంట్లపై పరీక్షల ఒత్తిడిని తగ్గించడంతో పాటు వాళ్లు ప్రిపేర్ అయ్యేందుకు తగినంత సమయం ఇచ్చేందుకు ఉపయోగపడుతుందని కేంద్ర విద్యాశాఖ పేర్కొంది. 
  • 2024లో ప్రారంభమయ్యే అకడమిక్ ఇయర్ నుంచి కొత్త పుస్తకాలు అందుబాటులోకి వస్తాయి. బుక్స్ ధర తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర విద్యాశాఖ పేర్కొంది.  
  • ఇకపై ఇంటర్ స్టూడెంట్లు తప్పనిసరిగా రెండు లాంగ్వేజెస్ చదవాల్సి ఉంటుంది. వీటిలో ఒక్కటి తప్పనిసరిగా మన దేశ భాష అయి ఉండాలి. ప్రస్తుత విధానంలో ఇంటర్ స్టూడెంట్లకు ఒక్క లాంగ్వేజ్ సబ్జెక్ట్ మాత్రమే ఉంది. 
  • ఇంటర్ స్టూడెంట్లు ఆర్ట్స్, సైన్స్, కామర్స్ అంటూ ఆ కోర్సులకు సంబంధించిన సబ్జెక్ట్స్ కు మాత్రమే పరిమితం కావాల్సిన అవసరం లేదు. 
  • ఇకపై విద్యార్థులు తమకు నచ్చిన సబ్జెక్టులను ఎంచుకోవచ్చు. 
  • బోర్డు ఎగ్జామ్స్ కు సంబంధించిన క్వశ్చన్ పేపర్లు తయారు చేసే, విద్యార్థులు రాసిన పేపర్లను దిద్దే టీచర్లు.. దీనికి సంబంధించి యూనివర్సిటీ సర్టిఫైడ్ కోర్సులు చేయాల్సి ఉంటుంది.