ఆమనగల్లు, వెలుగు : రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు చనిపోగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామంలో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... అంతారం గ్రామానికి చెందిన పెద్ద శ్రీనివాస్ గౌడ్ (45), శారదమ్మ (52), శ్రీనుగౌడ్, పద్మమ్మ, నాలుగేళ్ల చిన్నారి రిషితో కలిసి షిఫ్ట్ కారులో తలకొండపల్లి నుంచి అంతారం వెళ్తున్నారు. ఇదే సమయంలో హైదరాబాద్కు చెందిన మురళీధర్ శాస్త్రి, దత్తు మరో కారులో వెల్జాల్ నుంచి హైదరాబాద్ వైపు వస్తున్నారు.
ఈ క్రమంలో మార్గమధ్యలోని తలకొండపల్లి – మిడ్జిల్ ప్రధాన రహదారిపై రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. తీవ్రంగా గాయపడిన శారదమ్మ, పెద్ద శ్రీనివాస్గౌడ్ హాస్పిటల్కు తరలిస్తుండగా.. చనిపోగా, శ్రీను గౌడ్, పద్మమ్మ, రిషి, మురళీధర్ శాస్త్రి, దత్తు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
- లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు, 15 మందికి గాయాలు
కొల్చారం, వెలుగు : ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టిన ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ప్రమాదం మెదక్ జిల్లా కొల్చారం బస్టాండ్ సమీపంలో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు 40 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి బోధన్ వెళ్తోంది. కొల్చారం బస్టాండ్ సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో వెనుక నుంచి ఢీకొట్టింది.
బస్సులో ఉన్న పన్యాల మల్లారెడ్డి, ఆయన కూతురు రమ్యశ్రీ, ఎండీ. జాకీర్, శక్తివేల్, ఎరుకల లక్ష్మి, అమ్రిన్, ఎండీ. రఫిఖ్ తీవ్రంగా గాయపడగా మరో ఎనిమిది మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం విషమం తెలుసుకున్న కొల్చారం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని గాయపడిన వారిని 108లో మెదక హాస్పిటల్కు తరలించారు.

