రైలులో సిగరెట్ తాగడం రైల్వే చట్టంలోని సెక్షన్ 167 ప్రకారం నేరం. కానీ ఇద్దరు యువకులు చట్టాన్ని పట్టించుకోకుండా రైల్లో పిల్లలు, వృద్ధులు, ఇతర ప్రయాణీకుల ముందు బహిరంగంగా ధూమపానం చేశారు. గుజరాత్ రాష్ట్రంలోని భుజ్ బరేలీ మధ్య నడిచే రైళ్లో(14322 బరేలీ ఎక్స్ ప్రెస్) లో ఇద్దరు వ్యక్తులు స్మోక్ చేశారు. కోచ్ లో ఉన్న మిగతా వారు సిగరెట్లు కాల్చడంపై అభ్యంతరం వ్యక్తం చేసినా పట్టించుకోలేదు. సిగరెట్లు తాగొద్దన్న ప్రయాణికుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఈ నేపథ్యంలో ఓ ప్రయాణికుడు దీనికి సంబంధించి వీడియో తీశాడు. ట్విట్టర్లో రైల్వే శాఖకు ఫిర్యాదు చేశాడు.
బరేలీ ఎక్స్ ప్రెస్ లో యువకులు సిగరెట్లు తాగడంపై రైల్వే శాఖ స్పందించింది. ఫిర్యాదు చేసిన ప్రయాణికుడి వివరాలు తెలుసుకుంది. ఆ తర్వాత స్టేషన్ లో రైలు ఆగినప్పడు కంపార్ట్ మెంట్ వద్దకు వచ్చిన RPF సిబ్బంది..సిగరెట్లు కాల్చిన ఇద్దరు ప్రయాణికులను హెచ్చరించారు. మరోవైపు ధైర్యంగా వీడియో తీసి ఫిర్యాదు చేసిన యువకుడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. వీడియోతో పాటు.. రైల్వే చర్యల ట్వీట్లు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అయ్యాయి.