యూజీసీ కొత్త రూల్..ర్యాగింగ్ మితిమిరితే ప్రిన్సిపాలే జవాబుదారీ

యూజీసీ కొత్త రూల్..ర్యాగింగ్ మితిమిరితే  ప్రిన్సిపాలే జవాబుదారీ

న్యూఢిల్లీ : యూనివర్సిటీల్లో ర్యాగింగ్ కేసులు మితిమీరి నమోదైతే సంబంధిత  కాలేజీ ప్రిన్సిపాల్, యూనివర్సిటీ రిజిస్ట్రార్‌‌ జవాబు చెప్పాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) హెచ్చరించింది. ఇన్‌‌స్టిట్యూట్‌‌లలో ర్యాగింగ్‌‌ను క్రిమినల్ నేరంగా పేర్కొంటూ.. దానిని నిర్మూలించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై యూజీసీ ఓ సర్క్యులర్​ను జారీ చేసింది. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన యాంటీ ర్యాగింగ్ మానిటరింగ్ కమిటీ సూచించిన మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని సూచించింది.

నిబంధనలను ఉల్లంఘిస్తే శిక్షార్హమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కమిషన్ హెచ్చరించింది. జూనియర్లు, సీనియర్ల మధ్య ఫ్రెండ్లీ రిలేషన్​ ఏర్పడేందుకు మెంటార్లను రూపొందించే కాన్సెప్ట్‌‌ను ప్రవేశపెట్టాలని సూచించింది. ర్యాగింగ్‌‌ నిరోధక కేంద్రం, ర్యాగింగ్‌‌ నిరోధక బృందాలకు న్యాయ సలహాదారులను ఏర్పాటు చేయాలని తెలిపింది.

తీవ్రమైన ర్యాగింగ్ లేదా ఆత్మహత్య కేసులు గుర్తిస్తే.. కాలేజీ ప్రిన్సిపాల్, విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌‌ జాతీయ యాంటీ ర్యాగింగ్​ మానిటరింగ్ కమిటీకి ముందు హాజరై సమాధానం చెప్పాలని యూజీసీ పేర్కొంది.