
న్యూఢిల్లీ : యూనివర్సిటీల్లో ర్యాగింగ్ కేసులు మితిమీరి నమోదైతే సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్, యూనివర్సిటీ రిజిస్ట్రార్ జవాబు చెప్పాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) హెచ్చరించింది. ఇన్స్టిట్యూట్లలో ర్యాగింగ్ను క్రిమినల్ నేరంగా పేర్కొంటూ.. దానిని నిర్మూలించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై యూజీసీ ఓ సర్క్యులర్ను జారీ చేసింది. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన యాంటీ ర్యాగింగ్ మానిటరింగ్ కమిటీ సూచించిన మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని సూచించింది.
నిబంధనలను ఉల్లంఘిస్తే శిక్షార్హమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కమిషన్ హెచ్చరించింది. జూనియర్లు, సీనియర్ల మధ్య ఫ్రెండ్లీ రిలేషన్ ఏర్పడేందుకు మెంటార్లను రూపొందించే కాన్సెప్ట్ను ప్రవేశపెట్టాలని సూచించింది. ర్యాగింగ్ నిరోధక కేంద్రం, ర్యాగింగ్ నిరోధక బృందాలకు న్యాయ సలహాదారులను ఏర్పాటు చేయాలని తెలిపింది.
తీవ్రమైన ర్యాగింగ్ లేదా ఆత్మహత్య కేసులు గుర్తిస్తే.. కాలేజీ ప్రిన్సిపాల్, విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ జాతీయ యాంటీ ర్యాగింగ్ మానిటరింగ్ కమిటీకి ముందు హాజరై సమాధానం చెప్పాలని యూజీసీ పేర్కొంది.