ప్రపంచ దేశాలకు 100 కోట్ల వ్యాక్సిన్ డోసులను అందించేందుకు G-7 దేశాలు కట్టుబడి ఉన్నాయని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. ఇందులో సగం అమెరికా అందిస్తుండగా.. 10 కోట్ల డోసులను బ్రిటన్ అందిస్తుందని తెలిపారు. పేద దేశాలకు వ్యాక్సిన్లు అందించేందుకు కలసి రావాలన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పిలుపుతో ఆయన స్పందించారు. రాబోయే వారంలో ఐదు కోట్ల డోసులను విరాళంగా ఇవ్వనున్నట్లు జాన్సన్ ప్రకటించారు.
ఇప్పటి వరకు ఉత్పత్తి అయిన వ్యాక్సిన్లను ధనిక దేశాలు కొనుగోలు చేయడంతో... పేద దేశాలకు వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. దీంతో అమెరికా, బ్రిటన్ వంటి దేశాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతోనే 50 కోట్ల వ్యాక్సిన్ డోసులను అందించాలని బైడెన్ నిర్ణయించారు. 40 కోట్లకు పైగా డోసులను ఆర్డర్ చేసిన బ్రిటన్ కూడా..పేద దేశాలకు విరాళంగా అందించడంలో విఫలమైనందుకు విమర్శలు రావడంతో ..ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. బ్రిటన్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరిగింది. ఈ క్రమంలోనే మిగిలిన మోతాదులను ప్రపంచంలోని ఇతర దేశాలకు అందించనున్నట్లు తెలిపారు.