వెలుగు బిజినెస్ డెస్క్: దేశంలో మూడింట రెండొంతుల మందిగా ఉన్న మిడిల్క్లాస్ను గత కొన్నేళ్లుగా ప్రభుత్వాలు బడ్జెట్లలో పెద్దగా పట్టించుకోవడం లేదని కొంత మంది ఎక్స్పర్టులు విమర్శిస్తున్నారు. రాబోయే 25 ఏళ్లలో దేశంలో మిడిల్క్లాస్ జనాభా రెట్టింపవుతుందనే అంచనాలున్నాయి. ఎక్కువ పన్నులు కడుతున్నామని దేశంలోని మిడిల్ క్లాస్ జనాభా వాపోతున్నారు. ఇలా చెల్లించినా, షార్ట్టర్మ్లో తమకు ఎలాంటి ప్రయోజనాలు దక్కడం లేదని తలపోస్తున్నారు. దీంతో ఈసారి బడ్జెట్లోనైనా పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో ఏదైనా వెసులుబాటు ఉంటుందేమోనని వెయ్యి కళ్లతో వారు ఎదురుచూస్తున్నారు. ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఇటీవల ఒక సందర్భంలో తానూ మిడిల్క్లాసేనని చెబుతూ, ప్రస్తుత ప్రభుత్వం మిడిల్క్లాస్ ప్రజలకు భారమయ్యేలా పన్నులేవీ విధించలేదని పేర్కొన్నారు. మిడిల్క్లాస్ కుటుంబాల ఒత్తిళ్లు ఎలా ఉంటాయో తనకు ప్రత్యక్షంగా తెలుసని నిర్మలా అన్నారు. మిడిల్క్లాస్ జనాభా పెరుగుతున్న నేపథ్యంలో తప్పకుండా ప్రభుత్వం వారి కోసం కొంత ఎక్కువే మేలు చేస్తుందనే హామీని కూడా ఇచ్చారు. మిడిల్క్లాస్ ప్రజల కోసం చాలా చేశామని, ఇంకా చేస్తూనే ఉంటామని నిర్మలా స్పష్టం చేశారు.
పడిపోయిన కుటుంబ పొదుపు..
దేశంలో ఇన్ఫ్లేషన్ పెరగడంతో కుటుంబాల పొదుపు అయిదేళ్ల కనిష్టానికి పడిపోయింది. మిడిల్క్లాస్ పర్చేజింగ్ పవర్ను ఇన్ఫ్లేషన్ హరించేసింది. దేశంలోని కుటుంబ పొదుపు 2020–21లో 15.9 శాతమైతే, అది 2021–22 ఫైనాన్షియల్ ఇయర్ నాటికి 10.8 శాతానికి తగ్గిపోయింది. అంతకు ముందు మూడేళ్లకు చూసినా ఈ కుటుంబ పొదుపు 12 శాతంగా ఉండేది. అవసరాల కోసం లోయర్ మిడిల్క్లాస్ ప్రజలు పొదుపు నుంచి డబ్బు వాడేయడంతో వారి పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది.
ప్రభుత్వం చొరవ తీసుకోవాలి..
దేశంలోని మిడిల్క్లాస్ ప్రజల ఆదాయం పెరిగేలా, మరిన్ని ఉద్యోగాలు వచ్చేలా ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవచ్చని ప్రొఫెసర్ అరుణ్కుమార్ చెప్పారు. అన్ఆర్డనైజ్డ్ సెక్టార్లో డిమాండ్ పెరిగేలా చర్యలు తీసుకుంటే మంచిదని చెబుతూ, ఫలితంగా స్లోడౌనవుతున్న ఆర్గనైజ్డ్ సెక్టార్ మళ్లీ వేగంగా పుంజుకుంటుందని పేర్కొన్నారు. దేశంలో డిమాండ్ పెరిగేలా చొరవ తీసుకుంటే స్లోడౌన్ను నివారించొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలోని అన్ఆర్గనైజ్డ్ సెక్టార్పై జీఎస్టీ దెబ్బకొట్టిందని, కరోనా మహమ్మారి కంటే ముందే గ్రోత్పై ఎఫెక్ట్ చూపెట్టిందని అరుణ్కుమార్ చెప్పారు. జీఎస్టీ అనేది లాస్ట్పాయింట్ ట్యాక్స్ కాబట్టి, ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, సప్లయ్చెయిన్ మొత్తం మీద కాకుండా చివరి పాయింట్లో మాత్రమే దానిని వసూలు చేసేలా మెకానిజం ఉండాలని పేర్కొన్నారు. ఫలితంగా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ తిరిగి పుంజుకుంటుందన్నారు.అర్బన్ ఏరియాలలోని ప్రజల కోసం ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీము తేవాలని సూచించారు. 2020 నుంచి ప్రతీసారీ బడ్జెట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచుతున్నట్లు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ ఫైనాన్షియల్ఇయర్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ను ఏకంగా 35 శాతం పెంచి రూ. 7.5 లక్షల కోట్లు గా చేసినట్లు పేర్కొన్నారు.
వాడకం పెంచేది వారే..
దేశంలో వినియోగాన్ని నడిపించేది మిడిల్క్లాస్ ప్రజలేనని ఎక్స్పర్టులు చెబుతున్నారు. దేశం డెవలప్డ్ ఎకానమీగా మారాలంటే మరింత ఎక్కువగా వారి వినియోగం ఉండేలా చూడాలని పేర్కొంటున్నారు. ఇండియా గ్రోత్రేట్ సైకిల్ గరిష్టస్థాయికి చేరిందని, స్లోడౌన్ వస్తుందని ఇటీవలే నోమురా ఎనలిస్టులు తమ రిపోర్టులో పేర్కొన్నారు. దేశ జీడీపీ సెప్టెంబర్ క్వార్టర్లో 6.3 శాతం పెరిగిందనే ప్రకటన వచ్చాకే ఆ ఎనలిస్టులు తమ రిపోర్టును తెచ్చారు. అంతకు ముందు క్వార్టర్తో పోలిస్తే జీడీపీ గ్రోత్ సగానికి పడిపోయిన విషయం తెలిసిందే.
అప్పులపాలైన లోయర్ మిడిల్ క్లాస్....
అప్పర్ మిడిల్క్లాస్ ప్రజలు కరోనా టైములోనూ తమ పనులు తాము చేసుకోగలిగారు. కానీ, ఫ్యాక్టరీలను మూసివేయడంతో వాటిలో పనిచేసే లోయర్ మిడిల్క్లాస్ ప్రజలకు గట్టి దెబ్బ తగిలిందని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్రాజన్ పేర్కొన్నారు. దీంతో అప్పర్ మిడిల్ క్లాస్- లోయర్ మిడిల్క్లాస్ల మధ్య తేడా మరింత పెరిగిందని అభిప్రాయపడ్డారు. పేద ప్రజలకు రేషన్ దొరికింది. దాంతోపాటే అన్నీ దొరికాయి. సంపన్నులకు ఎలాంటి కష్టాలూ ఎదురవలేదు. కాకపోతే, లోయర్ మిడిల్క్లాస్ ప్రజలు మాత్రం బాగా నష్టపోయారని రఘురామ్రాజన్ చెప్పారు. వారి ఉద్యోగాలు పోయాయి. నిరుద్యోగం పెరిగింది. వాళ్ల అప్పులు పెరిగిపోయాయి. వీటిని మనం పట్టించుకోవాలని రాజన్ సూచించారు.