
- ఎన్ఎస్ జీ 41వ రైజింగ్ డేలో అమిత్ షా కామెంట్
మనేసర్: టెర్రరిస్టులకు ఈ భూమ్మీద ఏ ప్లేస్ కూడా సేఫ్ కాదని ఆపరేషన్ సిందూర్ తో తేలిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. టెర్రరిస్టుల స్థావరాలు, హెడ్ క్వార్టర్లు, లాంచ్ ప్యాడ్లను ఆపరేషన్ సిందూర్ తో నాశనం చేశామన్నారు. మంగళవారం హర్యానాలోని మనేసర్ లో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్ జీ) ప్రధాన కార్యాలయంలో 41వ రైజింగ్ డే వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి అమిత్ షా హాజరై మాట్లాడారు. మన దేశం మీద దాడి చేసిన టెర్రరిస్టులు ఎక్కడ ఉన్నా, భూమిలో ఎంత లోతులో దాక్కున్నా.. మన భద్రతా బలగాలు వదలబోవన్నారు.
‘‘పహల్గాంలో అమాయక టూరిస్టులను చంపిన ఉగ్రవాదులను మన బలగాలు అత్యంత కచ్చితత్వంతో మట్టుబెట్టాయి. అలాగే, దేశ ప్రజల్లో మన బలగాలపై నమ్మకం కూడా పెరిగింది. మేము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టెర్రరిజంపై ఉక్కుపాదం మోపుతున్నాం” అని అమిత్ షా పేర్కొన్నారు.