కుటుంబ సమేతంగా శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న అమిత్ షా

కుటుంబ సమేతంగా శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న అమిత్ షా

శ్రీశైలం: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కుటుంబ సమేతంగా శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారలను దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా దర్శనం కోసం ఆలయానికి వచ్చిన అమిత్ షా దంపతులకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దంపతులు, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి,  దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిమోహన్, జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు, దేవస్థాన కార్యనిర్వహణాధికారి కేఎస్‌.రామారావు, అర్చకస్వాములు, వేద పండితులు ఆలయ మర్యాదలతో రాజగోపురం వద్ద పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దంపతులను ఆలయంలోకి తీసుకువెళ్లి స్వామి అమ్మవార్లను దర్శనం చేయించారు. 
అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దంపతులకు అర్చక స్వాములు, వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనాలు పలికి తీర్థప్రసాదాలు అందించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్,  నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి, జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిమోహన్ గారు, దేవస్థాన ఈవో కేఎస్‌.రామారావు స్వామివారి శేషవస్త్రాలను, ప్రసాదాలను, స్వామి అమ్మవార్ల జ్ఞాపికను కేంద్ర హోం శాఖ మంత్రి దంపతులకు అందజేశారు.
తరువాత శ్రీశైలంలోని పంచమఠాలలో ఒకటైన ఘంటా మఠం జీర్ణోద్ధరణ సందర్భంగా లభించిన పురాతన తామ్ర శాసనాలను ఆలయ ప్రాంగణంలో నిశితంగా పరిశీలించారు. శ్రీశైల దేవస్థానం ఆలయ అధికారులు శాసనలకు సంబంధించిన చారిత్రాత్మక విశేషాలను దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణిమోహన్, దేవస్థానం ఈవో కె.ఎస్.రామారావు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు వివరించారు. అనంతరం పశ్చిమ మాడ వీధిలో అర్జున మొక్కలను నాటి నీళ్లు పోశారు.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వెంట ఇంటెలిజెన్స్ ఐజీ శశిధర్ రెడ్డి, కర్నూలు డిఐజి వెంకట్రామిరెడ్డి, కర్నూలు జిల్లా ఎస్ పి సుధీర్ కుమార్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి, నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, దేవస్థాన ఈవో కేఎస్‌.రామారావు, కర్నూల్ ఆర్ డిఓ హరి ప్రసాద్, ఆత్మకూరు డిఎస్పీ శృతి తదితరులు ఉన్నారు.