- 2014 డిసెంబర్ 31వరకు భారత్కు వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం
- ఆన్లైన్లోనే పౌరసత్వ దరఖాస్తులు.. దరఖాస్తు చేసుకునేందుకు వెబ్ పోర్టల్లోక్సభ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం
న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకున్నది. పౌరసత్వ సవరణ చట్టం –2019 (సీఏఏ)ను అమల్లోకి తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం సాయంత్రం గెజిట్విడుదల చేసింది. ఆ వెంటనే దేశమంతా సీఏఏ అమల్లోకి వచ్చింది. మతపరమైన హింస కారణంగా 2014 డిసెంబర్ 31 కంటే ముందు బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ నుంచి భారత్కు వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం ఇచ్చేందుకు లైన్ క్లియర్ అయింది. వీరికి పౌరసత్వం కల్పించేలా 2019 డిసెంబర్లో ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య మోదీ సర్కారు పార్లమెంట్లో ఈ బిల్లును ప్రవేశపెట్టగా, ఆమోదం పొందింది. దీనికి రాష్ట్రపతి కూడా సమ్మతి తెలిపారు. అయితే, సీఏఏను వ్యతిరేకిస్తూ అప్పట్లో దేశవ్యాప్తంగా ఘర్షణలు చెలరేగాయి. బీజేపేతర పార్టీల పాలిత రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ధర్నా చేశాయి.
ఈ ఆందోళనల్లో దాదాపు వందమందిదాకా మృతిచెందారు. అయితే , పూర్తి నిబంధనలపై సందిగ్ధత నెలకొనడంతో ఈ చట్టం ఇప్పటివరకూ అమల్లోకి రాలేదు. లోక్సభ ఎన్నికలముందే సీఏఏను అమల్లోకి తీసుకొస్తామని కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా నోటిఫికేషన్ జారీ అయ్యింది. దీంతో బిల్లు పాసయ్యాక నాలుగేండ్లకు సీఏఏకు వాస్తవరూపం వచ్చినట్టయింది. కాగా, సీఏఏను నోటిఫై చేయడంతో ఢిల్లీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఆన్లైన్ మోడ్లో పౌరసత్వ దరఖాస్తులు
సీఏఏ అమలుకు కేంద్రం గెజిట్ విడుదల చేయడంతో 2014 కంటే ముందు భారత్కు వచ్చిన హిందువులు, క్రిస్టియన్లు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు పౌరసత్వం లభించనున్నది. అర్హత ఉన్నవారు పౌరసత్వం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. ఇందుకోసం వెబ్ పోర్టల్ను కూడా సిద్ధం చేసినట్టు చెప్పారు. దరఖాస్తుదారుల దగ్గర ఇతర డాక్యుమెంట్టు ఏవీ అడగబోమని వెల్లడించారు.
నిబద్ధత చాటిన మోదీ: అమిత్ షా
సీఏఏ అమలుకు ఇచ్చిన నోటిఫికేషన్తో ప్రధాని నరేంద్రమోదీ మరోసారి తన నిబద్ధత చాటుకున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. హింసకు గురవుతున్న మైనార్టీలకు మన దేశంలో పౌరసత్వం లభించనున్నదని తెలిపారు. ఆయా దేశాల్లో నివసిస్తున్న హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్లకు మన దేశ రాజ్యాంగ నిర్మాతలు ఇచ్చిన వాగ్దానాన్ని మోదీ నెరవేర్చారని షా వ్యాఖ్యానించారు.
కాగా, కేంద్రం నిర్ణయాన్ని కాంగ్రెస్సహా ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకించాయి. బెంగాల్, అస్సాంలో రాబోయే ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే సీఏఏను అమల్లోకి తెచ్చారని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీం తీర్పు వార్తను కనుమరుగు చేసేందుకే సీఏఏ అమలు నిర్ణయమని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ విమర్శించారు. సీఏఏను మత విభజన చట్టంగా అభివర్ణించిన కేరళ సీఎం పినరయి విజయన్.. తమ రాష్ట్రంలో అమలు చేయబోమని తేల్చిచెప్పారు. పౌరసత్వ సవరణ చట్టం–2019 అమలును వ్యతిరేకిస్తామని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు.
ఏమిటీ చట్టం?
- ఈ పౌరసత్వ సవరణ బిల్లును మొదటిసారి 2016 జూలైలో పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అప్పుడు లోక్సభలో ఆమోదం పొందింది.
- ప్రతిపక్షాల నిరసనల మధ్య 2019 డిసెంబర్ 11న ఈ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందింది. రాష్ట్రపతి సమ్మతి లభించింది.
- పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్లో మతపరమైన హింస కారణంగా భారతదేశానికి
- వలస వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్
- మైనారిటీలకు భారత పౌరసత్వం ఇవ్వడం సీఏఏ లక్ష్యం.
- 64 ఏండ్ల కిందటి భారత పౌరసత్వ చట్టం –1955ను ఇది సవరించింది.
- భారత పౌరసత్వం పొందేందుకు దేశంలో 11 ఏండ్లపాటు నివసించడంకానీ.. పనిచేసి ఉండాలనే నిబంధనలను సవరించింది.
- సీఏఏ ప్రకారం పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్కు చెందిన ముస్లిమేతర శరణార్థులు పౌరసత్వం పొందాలంటే ఆరేండ్లపాటు దేశంలో నివసించడం లేదా పనిచేసి ఉండాలి.ఇందులో ముస్లింలను చేర్చకపోవడం వివాదానికి కారణమైంది.
- ఇది రాజ్యాంగంలోని మానవులకు సమాన హక్కులు కల్పించే ఆర్టికల్ 14ను ఉల్లంఘించడమేని ప్రతిపక్షాలు నిరసన తెలిపాయి.