- తన లెక్చర్ వీడియోలకు వ్యూవర్షిప్ పెరిగిందన్న మినిస్టర్
న్యూఢిల్లీ: యూట్యూబ్ ద్వారా నెలకు రూ. 4 లక్షలు సంపాదిస్తున్నారు మన కేంద్ర ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. యూట్యూబ్లో అప్లోడ్ అయిన తన లెక్చర్ వీడియోల ద్వారా నెలకు రూ. 4 లక్షలు వస్తోందని అన్నారు. కరోనా సంక్షోభం టైమ్లో తన లెక్చర్ వీడియోలను చూసిన వారు భారీగా పెరిగారని చెప్పారు. కరోనా సంక్షోభం టైమ్లో రెండు పనులు చేశానని అన్నారు. ‘నేను చెఫ్నయ్యా. ఇంట్లో వండడం ప్రారంభించా. వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా లెక్చర్లు ఇచ్చా. ఫారిన్ యూనివర్శిటీ స్టూడెంట్లను కలుపుకొని మొత్తం 950 లెక్చర్స్ను ఆన్లైన్ ద్వారా ఇచ్చా. ఈ వీడియోలు తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ అయ్యాయి’ అని పేర్కొన్నారు. ‘నా యూట్యూబ్ చానెల్ వ్యూవర్షిప్ పెరిగింది. రాయల్టీ కింద నెలకు రూ. 4 లక్షలను యూట్యూబ్ పే చేస్తోంది’ అని అన్నారు. భారుచ్ వద్ద ఢిల్లీ–ముంబై ఎక్స్ప్రెస్వే (డీఎంఈ) కన్స్ట్రక్షన్ను ఆయన రివ్యూ చేశారు. రోడ్డు కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్లకు, కన్సల్టెంట్లకు రేటింగ్ ఇవ్వడం ప్రారంభించామని చెప్పారు.
ఎలక్ట్రిక్ హైవే కోసం ఫారిన్ కంపెనీతో చర్చ..
ఢిల్లీ నుంచి జైపూర్ వరకు ఎలక్ట్రిక్ హైవేని నిర్మించడానికి ఫారిన్ కంపెనీతో చర్చలు జరుపుతున్నామని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. రైల్వే ఇంజిన్ల మాదిరే బస్సులు, ట్రక్లు కూడా ఎలక్ట్రిసిటీతో నడుస్తాయని చెప్పారు. ‘ఢిల్లీ–జైపూర్ వరకు ఎలక్ట్రిక్ హైవేను నిర్మించాలనేది నా కల. ఇదింకా ప్రపోజల్ స్టేజ్లోనే ఉంది. దీనిపై ఫారిన్ కంపెనీతో చర్చలు జరుపుతున్నాం’ అని పేర్కొన్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్ వాడకాన్ని ముగించాలని నిర్ణయించుకున్నానని అన్నారు. ఢిల్లీ–ముంబై ఎక్స్ప్రెస్వేని రివ్యూ చేయడానికి వచ్చిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.