న్యూఢిల్లీ: ట్విట్టర్ మరోసారి తన అహంకార పూరిత బుద్ధిని బయటపెట్టుకుంది. కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్విట్టర్ అకౌంట్ బ్లూ టిక్ తొలగించింది. సోమవారం ఉన్నట్టుండి ఆయన అఫీషియల్ అకౌంట్ బ్లూ టిక్ మాయం కావడంపై ట్విట్టర్ వర్గాలు ఓ వెరైటీ రీజన్ చెబుతున్నాయి. ఆయన తన ట్విట్టర్లో పేరు మార్చడమే కారణంగా చెబుతున్నట్టు తెలిసింది. ‘Rajeev MP’గా ఉన్న పేరును ఆయన ‘Rajeev_GOI’గా మార్చుకున్నారు. ఎవరైనా ట్విట్టర్ అకౌంట్ యూజర్ నేమ్ మార్చుకుంటే ఆటోమేటిక్గా ట్విట్టర్ వెరిఫైడ్ అకౌండ్ బ్యాడ్జ్ పోతుందని, ఇది తమ కొత్త పాలసీ అని ట్విట్టర్ వర్గాలు చెబుతున్నాయి.
గతంలోనూ ఇదే తీరు
మన దేశ ఐటీ పాలసీ రూల్స్ పాటించే విషయంలో కోర్టు గడప తొక్కి సవాల్ చేసి, సాగదీత ధోరణి అవలంబిస్తున్న ట్విట్టర్.. గతంలోనూ దుందుడుకుగా వ్యవహరించింది. గత నెలలో ఐటీ మినిస్టర్గా ఉన్న రవిశంకర్ ప్రసాద్ ట్విట్టర్ను కొంత సమయం సస్పెండ్ చేసింది. అలాగే భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్విట్టర్ అకౌంట్ బ్లూ టిక్ను కూడా తొలగించింది. కేంద్ర ప్రభుత్వం సీరియస్ కావడంతో మళ్లీ దానిని పునరుద్ధరించి తప్పుదిద్దుకుంది.