యునైటెడ్ నేషన్స్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీ20 డిన్నర్ ఇన్విటేషన్లో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కు బదులు ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’అని ఉండటంపై ప్రతిపక్షాలు రాజకీయంగా దాడి చేస్తున్నాయి. ఈ క్రమంలో దేశం పేరు మార్పుపై తాజాగా ఐక్యరాజ్య సమితి కూడా స్పందించింది. ప్రపంచంలోని ఏ దేశమైన పేరు మార్పు అభ్యర్థన తమ వద్దకు వస్తే స్వీకరిస్తామని తెలిపింది. ఈ సందర్భంగా ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటానియో గుటెర్రస్ డిప్యూటీ అధికార ప్రతినిధి ఫర్హన్ హఖ్ మాట్లాడుతూ, గతేడాది టర్కీ పేరును ఆ దేశం తుర్కియోగా మార్చుకుందని గుర్తుచేశారు. తుర్కియే విషయంలో ఆ దేశ ప్రభుత్వం తమకు చేసుకున్న అభ్యర్థనపై స్పందించి, దానిని పరిగణలోకి తీసుకున్నామని చెప్పారు.
అలాంటి అభ్యర్థనలు ఏవీ వచ్చినా.. తాము తప్పకుండా స్వీకరిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇండియా పేరును భారత్గా మార్చవచ్చనే వార్తలపై ఆయనను ప్రశ్నించగా, సమాధానం ఇచ్చారు. కాగా, దేశం పేరు మార్పుపై విమర్శలను పట్టించుకోవద్దని ప్రధాని మోదీ కేంద్ర మంత్రులకు బుధవారం సూచించారు. భారత్ అనేది దేశం పురాతన పేరు అని ఆయన పేర్కొన్నారు.