తహశీల్దార్ సజీవ దహనం: పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన దుండగుడు

తహశీల్దార్ సజీవ దహనం: పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన దుండగుడు

రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడో దుండగుడు. క్షణాల్లో ఒళ్లంతా మంటలు అంటుకుని, ఆ బాదకు కేకలు పెడుతూ కకావికలమైపోయిందామె. సిబ్బంది మంటలార్పి రక్షించే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. ఈ ప్రయత్నంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. తహశీల్దార్ విజయ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కాపాడబోయిన ఓ ఉద్యోగి పరిస్థితి కూడా విషమంగా ఉంది.

అడ్డుకుంటే.. తహశీల్దార్ రమ్మన్నారని చెప్పి

గుర్తుతెలియని వ్యక్తి నేరుగా ఆఫీసులోకి వెళ్లే ప్రయత్నం చేశాడని సిబ్బంది చెబుతున్నారు. అతడిని అడ్డుకునేందుకు అటెండర్ ప్రయత్నించాడు. అయితే.. తహశీల్దార్ తనను రమ్మన్నారని చెప్పి.. చాంబర్ లోకి వెళ్లాడు దుండగుడు. వెంట తెచ్చుకున్న పెట్రోల్ తహశీల్దార్ విజయపై పోసి నిప్పంటించాడని సిబ్బంది చెబుతున్నారు. ఇది గమనించిన సిబ్బంది ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో తహశీల్దార్ విజయ స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు.

లంచ్ టైంలో వచ్చి.. నిప్పంటించి.. పరార్

లంచ్ టైంలో జనం తక్కువ ఉన్న టైంను దుండగుడు ఎంచుకున్నాడు. పెట్రోల్ ను సంచిలో తెచ్చుకున్నట్లు అక్కడున్నవాళ్లు చెబుతున్నారు. జనం తక్కువగా ఉండటంతో.. దుండగుడి పని ఈజీ అయ్యింది. నేరుగా తహశీల్దార్ రూంలోకి వెళ్లి వెళ్లగానే పెట్రోల్ ఆమెపై పోసి వెంటనే నిప్పంటించి, పరారయ్యాడు. అక్కడున్న సిబ్బంది అప్రమత్తమై.. తహశీల్దార్ ను కాపాడే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే విజయ శరీరం మొత్తం కాలిపోయింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో ఇద్దరు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. వీళ్లలో ఒకరికి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.