న్యూఢిల్లీ: హైదరాబాద్లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియం రూపురేఖలు మారనున్నాయి. రూ. 117.17 కోట్లతో స్టేడియాన్ని రెనోవేట్ చేయనున్నారు. వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో రూ. 500 కోట్లతో ఉప్పల్ సహా దేశంలోని ఐదు మేజర్ స్టేడియాల్లో సౌకర్యాలను మెరుగు పరచాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. కొన్నేళ్లుగా హెచ్సీఏ పెద్దలు రాజకీయ కుమ్ములాటలతో హైదరాబాద్ క్రికెట్తో పాటు స్టేడియం నిర్వహణను గాలికొదిలేశారు. ప్రధాన సౌత్ స్టాండ్లోని పైకప్పు (కనోపి) నాలుగేండ్ల కిందట గాలివానకు ధ్వంసమైంది. ఈస్ట్, వెస్ట్ స్టాండ్స్కు పైకప్పు లేదు. దాంతో, మధ్యాహ్నం మ్యాచ్లకు హాజరయ్యే ఫ్యాన్స్ ఎండకు ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్లో ఎక్కువగా ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరగడం లేదు. ఐపీఎల్ జరిగే టైమ్లో మాత్రమే సన్రైజర్స్ ఫ్రాంచైజీ స్టేడియాని వాడుకుంటోంది.
అయితే సౌకర్యాలు బాగాలేవని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదు చేస్తున్నారు. ఉప్పల్తో పాటు దేశంలోని పలు స్టేడియాల్లో టాయిలెట్స్, మంచి నీళ్లు, సీటింగ్ వంటి కనీస సౌకర్యాలు సరిగ్గా లేకపోవడంపై ఫిర్యాదులు అందడంతో బీసీసీఐలో కదలిక వచ్చింది. అక్టోబర్–నవంబర్లో స్వదేశంలో జరిగే వన్డే వరల్డ్ కప్ ముంగిట హైదరాబాద్, ఢిల్లీ, కోల్కతా, మొహాలీ, వాంఖడే స్టేడియాలను తీర్చిదిద్దాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. వరల్డ్ కప్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చేందుకు షార్ట్లిస్ట్ చేసిన 12 వేదికల్లో మొహాలీ మినహా మిగిలిన నాలుగు స్టేడియాలున్నాయి. రెనోవేషన్ కోసం ఉప్పల్ స్టేడియానికి రూ.117.17 కోట్లు, ఢిల్లీకి 100 కోట్లు, ఈడెన్ గార్డెన్స్కు 127.47కోట్లు, మొహలీలోని పీసీఏ స్టేడియానికి 79.46 కోట్లు, వాంఖడేకు 78.82 కోట్లు కేటాయించినట్టు తెలుస్తోంది. ఈ స్టేడియాల్లో పైకప్పు పనులు చేపట్టాలంటే ఆ మొత్తం మరింత పెరిగే చాన్సుంది. ఉప్పల్ విషయానికి వస్తే స్టేడియంలో సీటింగ్ బాగానే ఉంది. రెనోవేషన్కు 117 కోట్లు కేటాయించిన నేపథ్యంలో అన్ని స్టాండ్లకు పైకప్పు ఏర్పాటు చేసి, పార్కింగ్ సమస్యను తీరిస్తే ఇబ్బందులు తప్పుతాయి. బీసీసీఐ టీమ్ ఇప్పటికే ఉప్పల్ స్టేడియాన్ని పరిశీలించి నివేదిక ఇచ్చినట్టు సమాచారం.