
- హెచ్టీఆర్ మెషీన్లో లీకేజీతో 48 రోజులు షట్ డౌన్
- రిపేర్లు పూర్తి చేసిన డెన్మార్క్ కంపెనీ, ఎల్అండ్టీ సంస్థ
గోదావరిఖని, వెలుగు: రామగుండం ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్లో బుధవారం నుంచి యూరియా ఉత్పత్తి మొదలు కానుంది. ఆగస్టు 14న హెచ్టీఆర్ మెషీన్లో లీకేజీ కారణంగా షట్డౌన్ కాగా, 48 రోజుల తరువాత మళ్లీ ఉత్పత్తి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్లాంట్లో యూరియా ఉత్పత్తి ప్రక్రియలో భాగంగా సింథసిస్ గ్యాస్ ప్రొడ్యూస్ చేసేందుకు ఏర్పాటు చేసిన హీట్ ట్రాన్స్ఫార్మింగ్ రీఫార్మర్(హెచ్టీఆర్)లో ట్యూబ్ లీకేజీ ఏర్పడడంతో ప్లాంట్ బంద్ అయింది.
ఈ మెషీన్ను ఏర్పాటు చేసిన డెన్మార్క్కు చెందిన హల్దర్ టాప్స్ కంపెనీ, ఎల్అండ్టీ సంస్థ సహకారంతో రిపేర్లు చేపట్టింది. హెచ్టీఆర్ మెషీన్లో డూమ్ సెట్ కాకపోవడంతో దానిని హైదరాబాద్కు పంపించి సరి చేయించారు. దీనిని రెండు రోజుల కింద బిగించారు. మంగళవారం ప్లాంట్ లైటప్ చేయగా, బుధవారం మధ్యాహ్నం నుంచి యూరియా ఉత్పత్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్లాంట్ రన్ అయి ఉత్పత్తి జరిగేంత వరకు డెన్మార్క్ కంపెనీ, ఎల్అండ్టీ ఉద్యోగులు ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్లోనే ఉండనున్నారు. ఈ ప్లాంట్లో రోజుకు 3,850 టన్నుల యూరియా ఉత్పత్తి అవుతుండగా, షట్డౌన్ కారణంగా 1.85 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి చేయడానికి అవకాశం లేకుండా పోయింది. ఈ ప్రభావం తెలంగాణ రైతాంగంపై తీవ్రంగా పడింది.