- ఎక్కడున్నా సెల్ కనెక్టివిటీ
- ఏఎస్టీ నుంచి శాటిలైట్ ఆధారిత సెల్యులార్ నెట్వర్క్
- హైదరాబాద్లో ఆర్ అండ్ డీ సెంటర్ ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: సెల్టవర్లు లేని ప్రాంతాల్లోనూ శాటిలైట్ ద్వారా సెల్యులార్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ను వచ్చే ఏడాది నుంచి అందిస్తామని అమెరికాకు చెందిన ఏఎస్టీ స్పేస్మొబైల్ ప్రకటించింది. తమది ప్రపంచంలోనే మొట్టమొదటి స్పేస్ ఆధారిత సెల్యులార్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ అని వెల్లడించింది. మన దేశంలో వొడాఫోన్ ఐడియా ద్వారా ఈ సేవలను అందిస్తామని ప్రకటించింది. ఇందుకోసం ఇది వరకే ఒక శాటిలైట్ను లాంచ్ చేశామని, వచ్చే సంవత్సరం మొదటి క్వార్టర్లోగా మరో నాలుగు శాటిలైట్లు లాంచ్ చేస్తామని తెలిపింది. హైదరాబాద్లో ఇది ఆర్ అండ్డీ సెంటర్ను సోమవారం మొదలుపెట్టింది. తెలంగాణ ఐటీ, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ దీనిని ప్రారంభించారు. నెక్స్ట్ జెనరేషన్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్, అంతరిక్ష సంబంధిత టెక్నాలజీలపై ఇది దృష్టి పెడుతుంది.
ఇక్కడే నెట్వర్క్ ఆపరేషన్స్ సెంటర్, ఇంజనీరింగ్ స్పేస్ హోస్టింగ్ ఉంటాయి. వొడాఫోన్, రాటుకెన్, అమెరికన్ టవర్, శామ్సంగ్ నెక్స్ట్, బెల్ కెనడా కూడా ఏఎస్టీ స్పేస్మొబైల్లో పెట్టుబడిదారులు. కంపెనీ చైర్మన్ అబెల్ అవెల్లాన్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ‘‘మాకు ప్రపంచవ్యాప్తంగా 700 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇండియాలో వీరి సంఖ్య 100. మా సేవలను వాడుకోవడానికి అదనంగా ఎటువంటి పరికరమూ అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న ఫోన్తోనే సిగ్నల్ పొందవచ్చు. మా టెక్నాలజీ 5జీని కూడా సపోర్ట్ చేస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా మేం 35 టెలికం ఆపరేటర్లతో కలసి పనిచేస్తున్నాం. ప్రపంచమంతటికీ సేవలు అందించడానికి 90 శాటిలైట్లను లాంచ్ చేస్తాం. భారతదేశంలో దాదాపు మూడింట రెండు వంతుల మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఏఎస్టీ స్పేస్ మొబైల్ మిషన్ వారికి ఎంతో ఉపయోగపడుతుంది. మాకు ప్రపంచవ్యాప్తంగా రెండు బిలియన్ల మంది కస్టమర్లు ఉన్నారు”అని అన్నారు.